TG

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్
TG· 19 Jul 2026

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్

TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్లాట్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు ఇవ్వకపోవడంతో అతని ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వెంకటేష్ ఇల్లు అమ్ముకుని కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్‌‌ను అరెస్ట్ చేసి, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులు, ప్రభుత్వాన్ని కోరారు.

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు
TG· 19 Jul 2026

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం చేపట్టిన 600 ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున చేరుకున్న రైతులు, గ్రామస్తులు అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగి, కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో DCP యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు CIలకు గాయాలయ్యాయి. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వీడియో ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్
TG· 19 Jul 2026

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం జరుగుతున్న భూసేకరణపై అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. దీక్ష చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించి, తెల్లవారుజామున విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 650ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు గతకొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టత లేకుండానే భూములు తీసుకోవడం సరికాదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ భార్య ఇంటి వద్ద కానిస్టేబుల్ హల్‌చల్
TG· 18 Jul 2026

మాజీ భార్య ఇంటి వద్ద కానిస్టేబుల్ హల్‌చల్

TG: మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ PSకు చెందిన కానిస్టేబుల్ కార్తీక్‌పై మాజీ భార్య ప్రవీణ తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం ఆస్తి పత్రాల కోసం తనను వేధిస్తున్నాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తూ మద్యం మత్తులో కత్తులతో ఇంటికి వచ్చాడని ఆరోపించారు. అతడితో పాటు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా తనపై దాడి చేశారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తనపై నిఘా పెట్టిస్తున్నాడని, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను కోరారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బస్సు డ్రైవర్లు
TG· 18 Jul 2026

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బస్సు డ్రైవర్లు

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ KLR కాలేజ్ బస్సు డ్రైవర్ భాస్కర్, కొత్తగూడెం SRDG జూనియర్ కాలేజ్ బస్ డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ SI ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్
TG· 18 Jul 2026

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

TG: వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్‌వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్‌, లింక్‌ టాక్సీవే, ఐసోలేషన్‌ బే, పెరిమీటర్‌ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్‌ రోడ్డు తదితరాల నిర్మాణం కోసం రూ. 2,034 కోట్ల అంచనా వయ్యంతో.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను 15 నెలల్లోగా పూర్తిచేయాలని పేర్కొంది. విమానాశ్రయ నిర్మాణం కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని CM రేవంత్‌ విజ్ఞప్తి చేయగా.. అందుకు కేంద్రం ఒకే చెప్పింది.

ధరణి అక్రమాలపై బిగ్ యాక్షన్
TG· 18 Jul 2026

ధరణి అక్రమాలపై బిగ్ యాక్షన్

TG: గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. CM రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, అసైన్డ్‌, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 10వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు గుర్తించామన్నారు.