Latest

హైవేపై గంజాయి రవాణా
AP: అనకాపల్లి జిల్లా కసింకోట వద్ద నేషనల్ హైవేపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. HOP హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా అందులో 60 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేసి, రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై జిల్లాలో తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు DSP మోహన్ పేర్కొన్నారు.

AI కంటెంట్కు ఇన్విజిబుల్ వాటర్మార్క్.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో AI కంటెంట్ పెరుగుతున్న టైమ్లో, మనుషులు డిజైన్ చేసిన కంటెంట్కు, AI కంటెంట్కు మధ్య తేడాను ఐడెంటిఫై చేయడానికి ఆంథ్రోపిక్ ఇన్విజిబుల్ వాటర్మార్క్ సిస్టమ్ను తీసుకొచ్చింది. క్లాడ్ AI మోడల్స్తో డిజైన్ చేసిన టెక్స్ట్, చిత్రాలకు ఈ వాటర్మార్క్ జత చేయనుంది. కాపీ, పేస్ట్ లేదా కొంత ఎడిటింగ్ చేసినా ఇది తొలగిపోకుండా డిజైన్ చేశారు. యూరోపియన్ AI యాక్ట్కు అనుగుణంగా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు.

నీటి కోసం రోడ్డెక్కిన కాలనీవాసులు
AP: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో తాగునీటి సమస్యపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా పలు కాలనీల్లో నీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని వాపోయారు. ఖాళీ బిందెలతో MPDO కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. MPDO అశోక్కుమార్రెడ్డి లేకపోవడంతో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శి వారితో చర్చించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అదానీ గ్రూప్ ప్రాజెక్టులకు 83,700 చదరపు అడుగుల అటవీ భూమి
అదానీ గ్రూప్కు చెందిన రెండు కంపెనీల ప్రాజెక్టుల కోసం దాదాపు 83,700 చదరపు అడుగుల అటవీ భూమిని మళ్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో రాయ్గడ్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్, మాంగ్రోవ్ భూమి, అమరావతి జిల్లాలోని అటవీ భూమి ఉన్నాయి. అటవీ అధికారులకు ఆ భూమిలో అడ్డంకి లేకుండా ఎంట్రీ ఉంటుందన్న కండీషన్తో పర్మిషన్ ఇచ్చారు. అలా చేయకపోతే ఈ పర్మిషన్ను వెంటనే విత్డ్రా చేసుకుంటారు.

స్కూల్లో ఫుడ్పై FSSAI కీలక ప్రపోజల్!
స్కూల్లో పిల్లలు తినే ఆహారంపై ఇక మరింత ఫోకస్ ఉండనుంది. ఎక్కువ ఫ్యాట్, షుగర్, ఉప్పు (HFSS) కలిగిన ఫుడ్ ఐటమ్స్కు లిమిట్ ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రపోజల్ చేసింది. సాలిడ్, లిక్విడ్ ఫుడ్ ఐటమ్స్కు వేర్వేరు స్టాండర్డ్స్ను సజెస్ట్ చేసింది. ఈ లిమిట్స్ దాటిన ఆహారాన్ని HFSSగా పరిగణించనున్నారు. దీనిపై ఆబ్జెక్షన్స్, సజెషన్స్ ఉంటే 60 రోజుల్లో సమర్పించాలని FSSAI కోరింది.
భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు
AP: నష్ట పరిహారం ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామాలు వదిలి వెళ్లిపోయాలని అధికారులు ఆదేశించడంపై వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు భగ్గుమన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్లోకి ప్రవేశించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవితోపాటు జిల్లా కార్యదర్శి సోమయ్య సంఘీభావం తెలిపారు. ‘పరదాలు కట్టుకుని, బిక్కుబిక్కుమంటూ బతికితే ఆ బాధ మీకు తెలుస్తుందని’ అధికారులు, పాలకులను ఉద్దేశించి రమాదేవి విమర్శించారు.

మరిపెడ PSలో భద్రత కరువు
TG: శిథిలావస్థలో ఉన్న పోలీస్స్టేషన్ భవనంలో విధులు కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడి ASI శ్రీనివాసరావుపై పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో ఏఎస్సై భుజానికి గాయమైంది. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. భవనం పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అందులోనే పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తుండటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నట్లు తెలిపారు.
నకిలీ ర్యాపిడో డ్రైవర్ వివాదం..మరో వీడియో చేసిన సిద్ధి
TG: హైదరాబాద్ నగరం చార్మినార్ దగ్గర ఆగస్టు 8 రాత్రి నకిలీ రాపిడో డ్రైవర్ వ్యవహారంపై సిద్ధి అనే యువతి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై పలువురు స్పందించి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ఇవాళ సిద్ధి మరో వీడియో చేశారు. అతని పేరు ఇర్ఫాన్ కాదని, మీర్జాఅని, క్లబ్ల్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడని చెప్పింది. తన వీడియోకు రాజకీయ, మతపరమైన రంగు వేయొద్దని కోరింది. రాపిడో యాప్ను నమ్ముతానని, కానీ ఎప్పుడూ డ్రైవర్, వాహన వివరాలు వెరిఫై చేసుకోవాలని హెచ్చరించింది.

మావోయిస్టు కీలక నేత సరెండర్.. రూ.20 లక్షల రివార్డు
TG: ములుగులో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకర్ల సమత తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. 1985లో పార్టీ మెంబెర్గా చేరిన ఆమె 1991లో ఏరియా కమిటీ, 1994లో జిల్లా కమిటీ మెంబెర్గా, 2003లో రాష్ట్ర కమిటీ మెంబెర్గా ఎదిగారు. తెలంగాణ గవర్నమెంట్స్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద అర్హత కలిగిన రూ.20 లక్షల రివార్డు చెక్కును DGP సీ.వీ. ఆనంద్ ఆమెకు అందజేశారు. మిగిలిన ముగ్గురు కేడర్లు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కలిసి ఉండలేక.. విడిపోలేక..
AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం విషాదంగా మారింది. ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ కలిసి అడవికోడి కాల్వలోకి దూకారు. ఘటనలో యువతి జగదాంబిక మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్వలో కొట్టుకుపోతున్న యువకుడిని గుర్తించిన స్థానికులు వెంటనే రక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
AP: సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఎ.టి.అగ్రహారంలోని తన ఇంట్లో మరణించారు. నాటక రచయితగా ఆయన విశేషమైన పేరు సంపాదించారు. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' నాటకాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 'ప్రచండ భారతం' సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఆయన 'భద్రాచలం', 'ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, 'ఇడియట్’, ‘గోపి గోపిక గోదావరి', ‘చందమామ కథలు’,‘వీరతెలంగాణ’, ‘నాంది’, ‘విరూపాక్ష' తదితర చిత్రాల్లో నటించారు.
కొలంబియాలో భారీ భూకంపం..111 మంది మృతి
పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 111 మంది మరణించగా, వందలాది మంది ఆచూకీ గల్లంతయ్యింది. కూలిపోయిన భవనాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు రక్షణ బృందాలు పని చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఆ దేశంలో నమోదైన అత్యంత బలమైన భూకంపంగా కొలంబియా జియాలజికల్ సర్వీస్ దీన్ని పేర్కొంది. ఇది చోకో ప్రాంతంలోని సాన్ జోస్ డెల్ పాల్మర్ సమీపంలో ఉదయం 7:34కి సంభవించింది. దీని ప్రభావం పెరెరా, కాలి, మనిజాలెస్ వంటి నగరాల్లో ఎక్కువగా కనిపించింది.

కన్నకొడుకుపై తండ్రి దాడి
TG: హైదరాబాద్ గుడిమల్కాపూర్లో తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అర్మాన్(4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. PV నరసింహారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104వద్ద ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి సల్మాన్ బాలుడిపై దాడిచేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని DCM వాహనం కిందకు తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అర్మాన్ మృతి చెందాడు.
ఆరుగురు బాలికలకు పాము కాటు.. హెలికాప్టర్లో హాస్పిటల్కు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జప్టలై గ్రామంలోని గవర్నమెంట్ ఎయిడెడ్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిన్న తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ను పాము కాటేసింది. వీరిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముగ్గురు బాలికలు చనిపోయారు. మరో ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తుండగా, ఒక బాలిక పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో జిల్లా అధికారులు, పోలీసులు ఆమెను బెటర్ ట్రీట్మెంట్ కోసం స్పెషల్ హెలికాప్టర్లో నాగ్పూర్లోని GMC హాస్పిటల్కు తీసుకెళ్లారు.

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం
ప్రజాశక్తి బుక్హౌస్ ‘లౌకిక భారతం కోసం గాంధీ’ పేరుతో వ్యాసాల పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, బిపిన్ చంద్ర, కుంకుం సంఘారి, రవీందర్ కుమార్ లాంటి వారు రాసిన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. అహింసా మార్గంలో ప్రజలను కదిలించిన రాజకీయ వ్యూహకర్తగా గాంధీ, కులవ్యవస్థ, మహిళా స్వేచ్ఛ, మతాల మధ్య ఐక్యత, లౌకికత్వం వంటి అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. దీని ధర ₹100. పుస్తకాన్ని <a href="https://navatelanganabooks.com/book/%e0%b0%b2%e0%b1%8c%e0%b0%95%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-loukika-bhartham-kosam/">ఇక్కడ </a>కొనొచ్చు.

బెంగళూరులో ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతు
నటుడు, సామాజికవేత్త ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత తొలగించిన 65 లక్షల ఓట్లర్లో తనూ ఒకడిని అని ఆయన వివరించారు. తను అక్కడే పుట్టానని, తన స్కూలింగ్, కాలేజీ, నాటక జీవితం అన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయని వివరించారు. ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశానని తెలిపారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందడానికి ఏ ప్రాసెస్ పాటించాలో చూద్దామని కామెంట్ చేశారు.

రాహుల్ సిప్లిగంజ్పై యువతి కేసు నమోదు
AP: విశాఖపట్నంలోని MVP పోలీస్ స్టేషన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు బుక్ అయ్యింది . రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చీట్ చేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. దీంతో రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్, మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు 'తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్' సర్వీసులు స్టార్ట్
AP: రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం 'తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్' వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల సేఫ్టీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తెలిపారు. తల్లీబిడ్డలను హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చడంతో పాటు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్, హైరిస్క్ గర్భిణులను హాస్పిటల్కు తీసుకొచ్చేనందుకు ఈ వెహికల్స్ ఉపయోగపడనున్నాయి. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. అవసరమైన వారు '102' టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు.

AIతో పులి ఫొటో.. భయపెట్టేందుకు బిగ్ స్కెచ్
AP: విశాఖపట్నం ఆరిలోవ PSలోని చిన్నగదిలి కొండ ప్రాంతంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఆరిలోవ CI శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇటీవల 112కు సమాచారం అందడంతో స్పందించిన పోలీసులు, ఫొటో, వీడియో విడుదల చేసిన అప్పలరాజును విచారించారు. అతని సహచరుడైన రాజు అనే వ్యక్తి, ఇతర ఖలాసీలు, కోడ్రైవర్లను భయపెట్టేందుకు AIతో సృష్టించిన నకిలీ పులి ఫోటోను చూపించినట్లు విచారణలో తేలింది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ఫేక్ న్యూస్ను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

రిపేర్ చేస్తుండగా కదిలిన బస్సు.. మెకానిక్ మృతి
TG: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్ల RTC బస్ డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా ముందుకు కదలడంతో మెకానిక్ మరణించాడు. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. సంతోష్ కుమార్ (39) బస్సు బ్రేక్ రిపేర్ చేస్తుండగా.. డ్రైవర్ అతడిని గమనించకుండా బస్సును ముందుకు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు కింద చిక్కుకున్న సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం
TG: హైదరాబాద్ బంజారాహిల్స్లో కవల శిశువుల విషాద ఘటనలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆరునెలలకే జన్మించిన కవలలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, ఒకరోజు వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. మొదటి శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు పంజాగుట్ట స్మశానవాటికలో ఖననం చేశారు. రెండో శిశువు మృతదేహాన్ని కూడా అక్కడే ఖననం చేసేందుకు తీసుకురాగా, మొదటి శిశువు సమాధి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. సమాధిని తవ్వి చూడగా మృతదేహం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.