Latest
భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు
AP: నష్ట పరిహారం ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామాలు వదిలి వెళ్లిపోయాలని అధికారులు ఆదేశించడంపై వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు భగ్గుమన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్లోకి ప్రవేశించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవితోపాటు జిల్లా కార్యదర్శి సోమయ్య సంఘీభావం తెలిపారు. ‘పరదాలు కట్టుకుని, బిక్కుబిక్కుమంటూ బతికితే ఆ బాధ మీకు తెలుస్తుందని’ అధికారులు, పాలకులను ఉద్దేశించి రమాదేవి విమర్శించారు.

మరిపెడ PSలో భద్రత కరువు
TG: శిథిలావస్థలో ఉన్న పోలీస్స్టేషన్ భవనంలో విధులు కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడి ASI శ్రీనివాసరావుపై పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో ఏఎస్సై భుజానికి గాయమైంది. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. భవనం పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అందులోనే పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తుండటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నట్లు తెలిపారు.
నకిలీ ర్యాపిడో డ్రైవర్ వివాదం..మరో వీడియో చేసిన సిద్ధి
TG: హైదరాబాద్ నగరం చార్మినార్ దగ్గర ఆగస్టు 8 రాత్రి నకిలీ రాపిడో డ్రైవర్ వ్యవహారంపై సిద్ధి అనే యువతి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై పలువురు స్పందించి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ఇవాళ సిద్ధి మరో వీడియో చేశారు. అతని పేరు ఇర్ఫాన్ కాదని, మీర్జాఅని, క్లబ్ల్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడని చెప్పింది. తన వీడియోకు రాజకీయ, మతపరమైన రంగు వేయొద్దని కోరింది. రాపిడో యాప్ను నమ్ముతానని, కానీ ఎప్పుడూ డ్రైవర్, వాహన వివరాలు వెరిఫై చేసుకోవాలని హెచ్చరించింది.

మావోయిస్టు కీలక నేత సరెండర్.. రూ.20 లక్షల రివార్డు
TG: ములుగులో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకర్ల సమత తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. 1985లో పార్టీ మెంబెర్గా చేరిన ఆమె 1991లో ఏరియా కమిటీ, 1994లో జిల్లా కమిటీ మెంబెర్గా, 2003లో రాష్ట్ర కమిటీ మెంబెర్గా ఎదిగారు. తెలంగాణ గవర్నమెంట్స్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద అర్హత కలిగిన రూ.20 లక్షల రివార్డు చెక్కును DGP సీ.వీ. ఆనంద్ ఆమెకు అందజేశారు. మిగిలిన ముగ్గురు కేడర్లు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కలిసి ఉండలేక.. విడిపోలేక..
AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం విషాదంగా మారింది. ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ కలిసి అడవికోడి కాల్వలోకి దూకారు. ఘటనలో యువతి జగదాంబిక మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్వలో కొట్టుకుపోతున్న యువకుడిని గుర్తించిన స్థానికులు వెంటనే రక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
AP: సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఎ.టి.అగ్రహారంలోని తన ఇంట్లో మరణించారు. నాటక రచయితగా ఆయన విశేషమైన పేరు సంపాదించారు. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' నాటకాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 'ప్రచండ భారతం' సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఆయన 'భద్రాచలం', 'ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, 'ఇడియట్’, ‘గోపి గోపిక గోదావరి', ‘చందమామ కథలు’,‘వీరతెలంగాణ’, ‘నాంది’, ‘విరూపాక్ష' తదితర చిత్రాల్లో నటించారు.
కొలంబియాలో భారీ భూకంపం..111 మంది మృతి
పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 111 మంది మరణించగా, వందలాది మంది ఆచూకీ గల్లంతయ్యింది. కూలిపోయిన భవనాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు రక్షణ బృందాలు పని చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఆ దేశంలో నమోదైన అత్యంత బలమైన భూకంపంగా కొలంబియా జియాలజికల్ సర్వీస్ దీన్ని పేర్కొంది. ఇది చోకో ప్రాంతంలోని సాన్ జోస్ డెల్ పాల్మర్ సమీపంలో ఉదయం 7:34కి సంభవించింది. దీని ప్రభావం పెరెరా, కాలి, మనిజాలెస్ వంటి నగరాల్లో ఎక్కువగా కనిపించింది.

కన్నకొడుకుపై తండ్రి దాడి
TG: హైదరాబాద్ గుడిమల్కాపూర్లో తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అర్మాన్(4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. PV నరసింహారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104వద్ద ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి సల్మాన్ బాలుడిపై దాడిచేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని DCM వాహనం కిందకు తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అర్మాన్ మృతి చెందాడు.
ఆరుగురు బాలికలకు పాము కాటు.. హెలికాప్టర్లో హాస్పిటల్కు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జప్టలై గ్రామంలోని గవర్నమెంట్ ఎయిడెడ్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిన్న తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ను పాము కాటేసింది. వీరిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముగ్గురు బాలికలు చనిపోయారు. మరో ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తుండగా, ఒక బాలిక పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో జిల్లా అధికారులు, పోలీసులు ఆమెను బెటర్ ట్రీట్మెంట్ కోసం స్పెషల్ హెలికాప్టర్లో నాగ్పూర్లోని GMC హాస్పిటల్కు తీసుకెళ్లారు.

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం
ప్రజాశక్తి బుక్హౌస్ ‘లౌకిక భారతం కోసం గాంధీ’ పేరుతో వ్యాసాల పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, బిపిన్ చంద్ర, కుంకుం సంఘారి, రవీందర్ కుమార్ లాంటి వారు రాసిన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. అహింసా మార్గంలో ప్రజలను కదిలించిన రాజకీయ వ్యూహకర్తగా గాంధీ, కులవ్యవస్థ, మహిళా స్వేచ్ఛ, మతాల మధ్య ఐక్యత, లౌకికత్వం వంటి అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. దీని ధర ₹100. పుస్తకాన్ని <a href="https://navatelanganabooks.com/book/%e0%b0%b2%e0%b1%8c%e0%b0%95%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-loukika-bhartham-kosam/">ఇక్కడ </a>కొనొచ్చు.

బెంగళూరులో ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతు
నటుడు, సామాజికవేత్త ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత తొలగించిన 65 లక్షల ఓట్లర్లో తనూ ఒకడిని అని ఆయన వివరించారు. తను అక్కడే పుట్టానని, తన స్కూలింగ్, కాలేజీ, నాటక జీవితం అన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయని వివరించారు. ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశానని తెలిపారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందడానికి ఏ ప్రాసెస్ పాటించాలో చూద్దామని కామెంట్ చేశారు.

రాహుల్ సిప్లిగంజ్పై యువతి కేసు నమోదు
AP: విశాఖపట్నంలోని MVP పోలీస్ స్టేషన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు బుక్ అయ్యింది . రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చీట్ చేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. దీంతో రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్, మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు 'తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్' సర్వీసులు స్టార్ట్
AP: రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం 'తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్' వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల సేఫ్టీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తెలిపారు. తల్లీబిడ్డలను హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చడంతో పాటు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్, హైరిస్క్ గర్భిణులను హాస్పిటల్కు తీసుకొచ్చేనందుకు ఈ వెహికల్స్ ఉపయోగపడనున్నాయి. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. అవసరమైన వారు '102' టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు.

AIతో పులి ఫొటో.. భయపెట్టేందుకు బిగ్ స్కెచ్
AP: విశాఖపట్నం ఆరిలోవ PSలోని చిన్నగదిలి కొండ ప్రాంతంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఆరిలోవ CI శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇటీవల 112కు సమాచారం అందడంతో స్పందించిన పోలీసులు, ఫొటో, వీడియో విడుదల చేసిన అప్పలరాజును విచారించారు. అతని సహచరుడైన రాజు అనే వ్యక్తి, ఇతర ఖలాసీలు, కోడ్రైవర్లను భయపెట్టేందుకు AIతో సృష్టించిన నకిలీ పులి ఫోటోను చూపించినట్లు విచారణలో తేలింది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ఫేక్ న్యూస్ను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

రిపేర్ చేస్తుండగా కదిలిన బస్సు.. మెకానిక్ మృతి
TG: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్ల RTC బస్ డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా ముందుకు కదలడంతో మెకానిక్ మరణించాడు. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. సంతోష్ కుమార్ (39) బస్సు బ్రేక్ రిపేర్ చేస్తుండగా.. డ్రైవర్ అతడిని గమనించకుండా బస్సును ముందుకు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు కింద చిక్కుకున్న సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం
TG: హైదరాబాద్ బంజారాహిల్స్లో కవల శిశువుల విషాద ఘటనలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆరునెలలకే జన్మించిన కవలలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, ఒకరోజు వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. మొదటి శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు పంజాగుట్ట స్మశానవాటికలో ఖననం చేశారు. రెండో శిశువు మృతదేహాన్ని కూడా అక్కడే ఖననం చేసేందుకు తీసుకురాగా, మొదటి శిశువు సమాధి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. సమాధిని తవ్వి చూడగా మృతదేహం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

NEETకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్కు నిర్వహిస్తున్న NEETను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేయనుంది. కేంద్ర చట్టాలను సవరించి దేశంలో అమలవుతున్న యూనిఫైడ్ NEET పాలసీని క్యాన్సిల్ చేయాలని హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ రిజల్యూషన్ ప్రవేశపెట్టనున్నారు. NEET వల్ల సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ ఉండవని, రూరల్, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న స్టూడెంట్స్కు ప్రాబ్లమ్స్ రావొచ్చని తీర్మానంలో పేర్కొన్నారు. కోచింగ్పై ఆధారపడటం పెరిగి, స్టూడెంట్స్ ఫోకస్ చదువు నుంచి డైవర్ట్ అవుతుందని విమర్శించారు.

రాజమండ్రిలో ప్రేమజంట విషాదం
AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కాతేరు గామన్ బ్రిడ్జి సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు ఓ యువతి మృతదేహంతోపాటు తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకుడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్గా, యువతి శాంతినగర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

యువకుల రక్షణకు లోకేశ్ బిగ్ యాక్షన్
AP: ఉద్యోగాల పేరుతో థాయ్లాండ్ వెళ్లి మోసపోయి బ్యాంకాక్లో చిక్కుకున్న తెలుగు యువకులకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తమను బలవంతంగా మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే రక్షించాలని బాధితులు సోషల్మీడియాలో వేడుకున్నారు. విషయంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వారి రక్షణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ కానిస్టేబుల్ ప్రపంచ రికార్డ్!
TG: హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ వి. సుధాకర్ అరుదైన వరల్డ్ రికార్డు సాధించారు. నేషనల్ లెవెల్ కరాటే స్పోర్ట్స్మెన్ సుధాకర్ 9 రకాల కరాటే టెక్నిక్లతో 80 షాబాద్ టైల్స్ను బద్దలు కొట్టారు. ‘మిషన్-80’ పేరుతో GVR కరాటే అకాడమీ ఏర్పాటు చేసిన డాక్టర్ GS మెల్కోటే పార్క్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. 8 నిమిషాల టైమ్ ఇవ్వగా.. కేవలం 3 నిమిషాల 26 సెకన్లలోనే టార్గెట్ని పూర్తి చేశారు. Wonder Book of Records International పర్యవేక్షణలో ఈ రికార్డు సాధించారు.

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా
TG: హైదరాబాద్లో గుప్త నిధుల పేరుతో మోసాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద నిధులున్నాయని నమ్మించి, గుంతల్లో బొగ్గు, ఫేక్ గోల్డ్ కాయిన్స్ పాతిపెట్టేవారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇలా 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్లు, నాలుగు ఫోన్లు, 25 ఫేక్ గోల్డ్ కాయిన్స్, పూజా ప్రొడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నారు.