Latest

గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి
AP: సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివని మాజీ మంత్రి గౌతు శివాజీ అన్నారు. లచ్చన్న 117వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టపురం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందస మండలం మందస, బాలిగాం జంక్షన్ లలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు.

ఇండస్ట్రియల్ కెమికల్స్ దొంగల అరెస్ట్
TG: నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ను అక్రమంగా దారి మళ్లిస్తూ అమ్ముతున్న ముఠాను చిట్యాల పోలీసులు అరెస్టు చేశారు. వెలిమేడు రాజస్థాన్ దాబా వెనక లారీలలో ట్యాంకర్లలో అక్రమంగా కెమికల్స్ను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి పీటలపై యువతి సంచలన నిర్ణయం.. వివాహం రద్దు
TG: పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో వివాహం రద్దయింది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, బిజినపల్లి మండలం సల్కర్పేట గ్రామానికి చెందిన యువతికి పెళ్లి కుదిర్చారు. పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అనంతరం పోలీసులు, సఖి కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని వారి పెద్దలకు నచ్చజెప్పారు.

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేలా రూ.484.42 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఏరియా ఆసుపత్రి & డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, లక్ష్మణ్ ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య ,ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

AIతో మాట్లాడుతున్నారా? జాగ్రత్త!
మన ఫోన్లోని AIతో మాట్లాడటం ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. ఏదైనా అడిగితే సమాధానం, రిమైండర్లు, మెసేజ్లు, స్మార్ట్ పరికరాల కంట్రోల్.. ఇలా చాలా పనులు వాయిస్తోనే జరిగిపోతున్నాయి. అయితే మనం మాట్లాడే మాటలు ఎక్కడ ప్రాసెస్ అవుతున్నాయి? ఎంతకాలం స్టోర్ అవుతున్నాయి? వాటిని ఎవరు యాక్సెస్ చేయగలరు? కొన్ని AI సర్వీసులు మెరుగైన సేవల కోసం వాయిస్ డేటాను ప్రాసెస్ లేదా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే AI సౌకర్యాన్ని ఉపయోగిస్తూనే, మన వాయిస్ డేటా ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

జాబ్ పోతే PFలో ఎంత డబ్బు?
ఉద్యోగం పోయిన వారికి PF డబ్బులపై కొత్త నిబంధనలు వచ్చాయి. EPF స్కీమ్-2026 ప్రకారం, ఉద్యోగం పోయిన వెంటనే PFలోని 75శాతం వరకు డబ్బు తీసుకోవచ్చు. 12 నెలల్లోనూ కొత్త ఉద్యోగం రాకపోతే మిగిలిన 25శాతం డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వస్తే 25శాతం తీసుకునే అవకాశం ఉండదు.

'ఆగస్టు' అని ఎలా పేరొచ్చింది!
క్యాలెండర్లో ఎనిమిదో నెల అయిన 'ఆగస్టు'కు ఆ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పూర్వం రోమన్ క్యాలెండర్లో ఇది ఆరో నెలగా ఉండేది, అందుకే లాటిన్ భాషలో దీనిని 'సెక్స్టిలిస్' (ఆరో నెల) అని పిలిచేవారు. అయితే, రోమన్ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయిన 'అగస్టస్ సీజర్' యుద్ధాల్లో సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా, ఆయన గౌరవార్థం క్రీస్తు పూర్వం 8వ సంవత్సరంలో రోమన్ పాలకులు ఈ నెలకు 'ఆగస్టు' అని పేరు మార్చారు. అలా ఆరో నెల కాస్తా అగస్టస్ చక్రవర్తి పేరు మీద 'ఆగస్టు'గా మారిపోయింది.

ఆస్తులు ఉన్నా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు!
ఆస్తులున్నా ఆత్మీయులు లేక ఓ కుబేరుడు అనాథగా కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన కోటీశ్వరుడు రాజకుమార్ సక్సేనాకు ఆస్తులు, ముగ్గురు కొడుకులు, కూతురు, భార్య ఉన్నారు. ఆస్తులన్నీ రాయించుకున్నాక అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆయన అనారోగ్యంతో ఈ నెల 11న ఆస్పత్రిలో మరణించారు. చనిపోయేముందు కుటుంబాన్ని చూడాలనుకున్నా ఆయన కోరిక తీరలేదు. డాక్టర్లు సమాచారమిచ్చినా తమకేం సంబంధం లేదని చెప్పారు. చివరికి పోలీసులే స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.

ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు వద్దు!
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, బాటిళ్లలో అమ్మే ప్యాకేజ్డ్ నీళ్ల కంటే తాజా నీళ్లు తాగడమే మంచిదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే ప్యాకేజ్డ్ నీళ్లలో ఖనిజాలు తగ్గి, పంచదార కలపవచ్చు. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రక్తంలో పొటాషియం ఎక్కువ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వీటిని ఎక్కువగా తాగకూడదు. విరోచనాలు, వాంతులై బాడీలో నీటిశాతం తగ్గినప్పుడు కొబ్బరి నీళ్లు ORS కి ఆల్టర్నేటివ్ కావు. ఆ టైమ్లో ORS వాడటమే మేలని డాక్టర్లు చెబుతున్నారు.

‘సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయింది’
TG: రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయిందని, భారత పార్లమెంట్లోనే సాటి సభ్యులను ‘లుంగీ వాలా’ అని పిలవడం దారుణమని జస్టిస్ సుదర్శనరెడ్డి అన్నారు. జాతీయ పార్టీకి చెందిన దళిత నాయకుడు ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం సామజిక అన్యాయనికి దర్పణం పడుతున్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో HYDలోని JNTU ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించకపోతే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు.

కాచిగూడ..ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ..అక్కడుంటే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? కాచి/కాచ్హి కులస్థులు ఉత్తర భారతదేశంలోని బుందేల్ఖండ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. వీరు వ్యవసాయం, తోటపని, కూరగాయలు, పండ్లు పండించేవాళ్లు. నది ఒడ్డున నివసించడం వీళ్లకు అలవాటు. ఏడవ నిజాం కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినప్పుడు 300 కాచి కుటుంబాలు ఆ పనుల్లో పాల్గొన్నాయి. నిజాం మూసీ నది తీరంలో భూములను వాళ్లకి బహుమతిగా ఇచ్చారు. అలా ఆ ప్రాంతానికి ‘కాచిగూడ’ పేరు పెట్టినట్లు చారిత్రక కథనాలున్నాయి.

Monsoon Special: బొంత కాకరకాయ
వర్షాకాలం రాగానే మార్కెట్లో బొంత కాకరకాయల (బోడ కాకర) గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండకపోవడం, అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయలో విటమిన్-సి, ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయలు ఇమ్యూనిటీని పెంచి, షుగర్, బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయకు ఈ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కిలో ధర రూ.300 వరకు ఉంది. కొంచెం ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిదని అందరూ ఇష్టంగా కొంటున్నారు.

ఒకే సెంటర్లో టెట్ పరీక్ష రాసిన తండ్రీకూతుళ్లు
AP: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తోటఊరు గ్రామానికి చెందిన తోట ఈశ్వరరావు, ఆయన కుమార్తె తోట శోభ విద్యారంగంలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఇటీవల నిర్వహించిన టెట్కు అటెండ్ అయ్యారు. ఇద్దరూ ఒకే కేంద్రంలో పరీక్ష రాశారు. తన తండ్రితో కలిసి టెట్ రాయడం మరపురాని అనుభవంగా నిలిచిందని తోట శోభ ఆనందం వ్యక్తం చేశారు.
‘చెల్లికి న్యాయం చేయలేనోడు.. ఆడబిడ్డలకు ఏం చేస్తాడు?’
TG: వరంగల్ జిల్లా పర్యటిస్తున్న సీఎం రేవంత్రెడ్డి సభలో సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి సీతక్కను తను సొంత చెల్లెలా చూసుకుంటానని, కానీ మరొకరు మాత్రం ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని బయటకు నెట్టేశారని ఆరోపించారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారని చర్చ సాగుతోంది.

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం
మలుపు బుక్స్, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కలిసి తీసుకొచ్చిన పుస్తకం 'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం'. రచయితలు కల్లూరి భాస్కరం, సౌదా అరుణ, డా.జిలుకర శ్రీనివాస్, రాహుల్, కె.శ్రీనివాస్, కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని రాసిన పదకొండు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ద్రావిడ జాతులపై వివక్ష, ద్రవిడ భాష, సంస్కృతి, సాహిత్యం ద్వారా అస్మిత నిర్మాణం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎడిటర్స్గా కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ఉన్నారు. పుస్తకం ధర రూ.150. పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/dravida-vivakshapai-dakshina-swaram?srsltid=AfmBOoqOJwWA4xUicb-zqftKrUpqFkRMq-DrY2VrCkDrfuIxhL5bboDB">లింక్</a>.

విద్యార్థులకు కుంగ్ ఫూ స్పైరింగ్ క్యాంప్ పోటీలు
TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని జీఎం పటేల్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన న్యూ మాక్స్ కుంగ్ ఫూ స్పైరింగ్ క్యాంపు పోటీలలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చించోడ్ వర్సెస్ కొందుర్గ్ టీమ్ మధ్య ఉత్కంఠగా సాగిన పోటీల్లో చించోడ్ టీం చెందిన నక్షత్ర ‘మ్యాచ్ ఆఫ్ ది బెస్ట్’గా నిలిచింది. ఆమెను కోచ్ రమేష్, చీఫ్ మాస్టర్లు అభినందించారు. ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా చీఫ్ ఇన్స్ట్రక్టర్ రాము మాస్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రమేష్, రాము, బాల్ రాజ్, ప్రభు, కర్ణ, నహిద్, సురేష్ రాఘవేందర్ పాల్గొన్నారు.

ఘనంగా కామ్రేడ్ సీతక్కకు నివాళులు
AP: శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలాసలో కామ్రేడ్ బాలకృష్ణ అధ్యక్షతన కామ్రేడ్ సీతక్క సంతాప సభ నిర్వహించారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమంలో సీతక్క పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ప్రజా ఉద్యమాల పట్ల ఆమె చూపిన అంకితభావం, ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సీతక్కకు ఘన నివాళులర్పించారు.

పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం
TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని అయోధ్యపుర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొందుర్గ్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి, సర్పంచ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల భద్రతపై దృష్టి సారించాలి: DSP
AP: విద్యార్థునుల భద్రతపై దృష్టి సారించాలని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని సూచించారు. మందస మండలం పట్టులోగాం గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలను సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్లతో కలిసి తనిఖీ చేశారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్శాఖ తరపున ఆశ్రమ పాఠశాలలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి చట్టాలపై అవగాహన కల్పించారు.

నార్త్ అమెరికా ఖండంలో ఎత్తైన శ్రీరాముడి విగ్రహం
నార్త్ అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం కెనడాలోని మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్లో ఇటీవల ఆవిష్కరించారు. ఏడుడుగల పీఠంపై నిలబడి ఉన్న శ్రీరాముడి విగ్రహం ఎత్తు 51 అడుగులు. ఛత్రం జోడించిన తర్వాత మొత్తం ఎత్తు 70 అడుగులకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. ఈ విగ్రహాన్ని భారతదేశంలోని మనేసర్లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్లో శిల్పి నరేశ్ కుమార్ కుమావత్ రూపొందించారు.

Gen Z ఇష్టపడుతున్న 'Snail Mail'
ఈ రోజుల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో సెకన్లలో మెసేజ్లు పంపే Gen Z యూత్.. ఇప్పుడు మళ్లీ పాతకాలపు చేతిరాత ఉత్తరాలను ఇష్టపడుతున్నారు. ఫోన్ స్క్రీన్ల నుంచి డిజిటల్ డిటాక్స్ అవ్వడానికి, మనస్ఫూర్తిగా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఈ 'స్నెయిల్ మెయిల్' పద్ధతిని ఫాలో అవుతున్నారు. పేపర్లను అందంగా డెకరేట్ చేసి, వింటేజ్ స్టాంపులతో ఫ్రెండ్స్కి పంపుతూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా చేతితో రాసే లేఖల్లో ఉండే ఆత్మీయతే వేరని నిరూపిస్తున్నారు.