Latest

ఈశా గ్రామోత్సవం-2026.. విజేతలు వీరే
TG: గ్రామీణ క్రీడాకారులను ఒక్కతాటిపైకి తీసుకురావడమే ఈశా గ్రామోత్సవం-2026 లక్ష్యమని ఈశా యోగా కేంద్రం సమన్వయకర్త స్వామి అంబర తెలిపారు. హైదరాబాద్ LB స్టేడియంలో జరిగిన మహిళల త్రోబాల్, పురుషుల వాలీబాల్ రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మహిళల త్రోబాల్లో కోయచల్క వారియర్స్, పురుషుల వాలీబాల్లో రంగారెడ్డి జిల్లా దేవుని పడకల్ జట్లు రాష్ట్ర ఛాంపియన్లుగా నిలిచాయి.

ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలి: నేహా బోరా
TG: ప్రజాస్వామ్యాన్ని, హక్కులను పరిరక్షించుకోవాలంటే యువత భయపడకుండా ప్రశ్నించే ధైర్యాన్ని పెంచుకోవాలని AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, JNUSU మాజీ అధ్యక్షుడు సాయి బాలాజీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని లామకాన్లో జరిగిన 15వ హాసన్ మెమోరియల్ లెక్చర్-2026లో వారు మాట్లాడారు. ద్వేష రాజకీయాలకు ముగింపు పలికే విధంగా యువత నిలవాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో యువత, విద్యార్థుల పాత్రను గుర్తుచేస్తూ ఖుదీరామ్ బోస్, భగత్సింగ్, అష్ఫాఖుల్లా ఖాన్ త్యాగాలను ప్రస్తావించారు.

ఉద్యోగుల సమస్యలపై ఇక పోరుబాటే: బొప్పరాజు
AP: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై AP JAC ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు రావాల్సిన సుమారు రూ.40వేల కోట్ల బకాయిలను అడుగుతుంటే ఉద్యోగులనే ప్రజల ముందు దోషులుగా చూపించడం సరికాదని JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం విషయంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకం: రవిశంకర్
AP: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి శక్తివంతమైన కేంద్రబిందువుగా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఆయన నిర్మాణ శైలి, కళాకృతులను ప్రశంసించారు. అనంతరం గూడెపువలసలో GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. GMR గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 11 వృత్తివిద్యా కోర్సుల్లో 239 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

తులం బంగారం హామీ ఏమైంది? : KTR
TG: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని KTR ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న భరోసాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదని, పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో BRS ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బాధితులకు భరోసా ఏది? : మేడా శ్రీనివాస్
AP: సైబర్ మోసాల్లో పోయిన డబ్బు ఎంత రికవరీ చేశారో ప్రజలకు లెక్క చెప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వేల కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నా.. వాటిని అరికట్టేందుకు ఖర్చు చేస్తున్న ప్రజాధనానికి తగ్గ ఫలితం కనిపించడం లేదని విమర్శించారు. పోలీస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాల వరకు ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఉండాలని కోరారు.

సెప్టెంబర్లో అన్ని లెక్కలు చెప్తా: CM
TG : వెయ్యిమంది KCRలు ఏకమై వచ్చినా నన్నేం చేయలేరని CM రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కుటుంబం, BRS రాజకీయ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. KCR పాలన ఫ్యామిలీ జస్టిస్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తోందన్నారు. యువత, నిరుద్యోగులు రాజకీయ ప్రచారాలకు ప్రభావితం కావొద్దని సూచించారు. గత ప్రభుత్వ పాలన, తమ ప్రభుత్వ పనితీరుపై రాబోయే సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని లెక్కలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు.

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!
సముద్రంలో ఎటు వెళ్లాలో మ్యాప్ లేకుండానే తాబేళ్లు ఎలా తెలుసుకుంటాయో తెలుసా? వాటికి భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ మాగ్నెటిక్ సంకేతాలను ఉపయోగించి సముద్రంలో దిశను గుర్తించడంతో పాటు, దూరంగా ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణించగలవు. కొన్ని రీసెర్చ్ల ప్రకారం, తాబేళ్లు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు వాసన వంటి ఇతర సంకేతాలను కూడా ఉపయోగించవచ్చు. అంటే GPS లేకపోయినా.. ప్రకృతే వాటికి నావిగేషన్ సిస్టమ్లా పనిచేస్తుందన్నమాట అనుకోండి!

MNR ఫౌండేషన్ 9వ ఉచిత కంటి వైద్య శిబిరం
AP: మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో MNR ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో 9వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుల్లూరు :ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(PACS)లో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 112 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 57 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.

యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు
TG: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 'యాక్సిస్ బ్యాంక్' ఆధ్వర్యంలో సంగీతం, నాట్యం, పాటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకకు మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు, ఉద్యోగులు, పిల్లల తల్లిదండ్రులు, డాన్స్ టీచర్లు పాల్గొన్నారు.

‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’
AP: ఎన్టీఆర్ జిల్లా పెడన మండలంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Dr.రాళ్ళపల్లి లక్ష్మణ స్వామి(చిన్నాపురం డాక్టర్) సహకారంతో పెడన బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలలో ‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’ కార్యక్రమం చేపట్టారు. 12000 మందికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1.6 లక్షల మొక్కలు పంచినట్టు సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఉస్మాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, పేరిశెట్టి నాగరవి, ఇమ్మనేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు
AP: మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త అధ్యక్షుడిగా గురిజాల సుధీర్, కార్యదర్శిగా వంక అనంత కుమార్, ట్రెజరర్గా బైత సత్యనారాయణని, గౌరవ అధ్యక్షులుగా చిలంకుర్తి నాగభూషణం(శేషు)ని మరో 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని ఆగస్టు 19న నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని చెప్పారు.

గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
AP: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఉద్రిక్తత నెలకొంది. భీమవరప్పాడు నుండి నిత్యం వందల సంఖ్యలో గ్రావెల్ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇళ్లపై దుమ్ము ధూళి పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమై వెల్లటూటరు ప్రధాన రహదారిపై గ్రావెల్ లారీలను అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను అడ్డుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. *

దిమాగీ నక్సల్ పార్టీ..మరో కొత్త మూమెంట్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో దేశంలో మరో కొత్త మూమెంట్ మొదలైంది. అదే ‘దిమాగీ నక్సల్ పార్టీ’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని, యువతను వాళ్లకు దూరంగా ఉంచాలని అన్నారు. దీనికి రియాక్షన్గా ఈ పార్టీ మొదలైంది. అప్పుడే ఈ పార్టీ ఇన్స్టా ఖాతాకు 47 వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ పార్టీకి Think, Research, Resist అనే సిద్ధాంతాలు ఉన్నట్టు ప్రకటించారు.

పవిత్ర సంగమంలో కారు చీకట్లు
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్ర సంగమంలో రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా–గోదావరి నదుల పవిత్ర కలయిక వద్ద సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పర్యాటకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవిత్ర సంగమానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వచ్చే వారికి లైట్లు వెలగకపోవడంతో చీకట్లోనే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
'వారణాసి షర్టు’లో మహేష్..
ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుని తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు తిరిగొచ్చిన హీరో మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన వేసుకున్న షర్ట్పై 'వారణాసి' అని రాసి ఉండటంతో పాటు శివుడి త్రిశూలం, సినిమాలో ధరించిన లాకెట్ లోగోలు కనిపిస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు అప్పుడే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారని అనుకుంటున్నారు.

జాతీయ గీతాన్ని మార్చాల్సిందే: ముఖేష్ ఖన్నా
దేశ జాతీయ గీతంగా ఉన్న 'జన గణ మన' స్థానంలో 'వందేమాతరం'ను తీసుకురావాలని ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణిని పొగుడుతూ 'జన గణ మన' రాశారని, అది మన జాతీయ గీతం కాకూడదని ఆయన తెలిపారు. పూర్తిగా మనదైన 'వందేమాతరం'పై తాను ఏడు నిమిషాల ఐకానిక్ పాటను రికార్డ్ చేశానని, అది ఆరు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు.

ఏపీలో జూనియర్ డాక్టర్ల ఎమర్జెన్సీ సేవలు బంద్
AP: స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవల కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సిబ్బందికి మెడికల్ లీవులతోపాటు ఇతర అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. అత్యవసర వైద్య సేవలు నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బాలీవుడ్ హీరోలకు షోకాజ్ నోటీసులు
బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర FDA(Food and Drug Administration) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల యాడ్లో యాక్ట్ చేసి, నిషేధిత పాన్ మసాలాను ప్రోత్సహించారని తెలిపింది. ఆ యాడ్స్ ప్రచారం వెంటనే ఆపాలని, సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలని ఆదేశించారు. అగ్రిమెంట్లు, పారితోషిక వివరాలు సబ్మిట్ చేయాలని కోరారు.

రాబోయే 22 గంటల్లో వాయుగుండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'స్పష్టమైన అల్పపీడనం'గా మారింది. ఇది రాబోయే 22 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్
AP: పల్నాడు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.