AP

రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదు
AP· 30 Jun 2026

రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదు

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కరించలేదని AP రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని కానీ, ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందనలేదని ఫైరయ్యారు. ఆరు నెలలకోసారి పెరగాల్సిన DAను రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే, PRC కమిషన్‌ను ఇప్పటివరకు నియమించలేదన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుడ్‌బై
AP· 28 Jun 2026

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుడ్‌బై

జూలై 8వ తేదీ నుంచి విశాఖపట్నం పాత ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన ప్రయాణాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు భారత నౌకాదళం ఆధీనంలో ఉన్న పాత ఎయిర్‌పోర్టు నుంచి సాగుతున్న ప్రయాణాలన్నీ, ఇకపై 50కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జరగనున్నాయి. ఈ కొత్త విమానాశ్రయం అత్యాధునిక సౌకర్యాలతో, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో రూపొందించారు. విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న పాత విమానాశ్రయం ఇకపై కేవలం ఇండియన్ నేవీ కార్యకలాపాలకే పరిమితం కానుంది.

వెలిగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుంది: CM
AP· 28 Jun 2026

వెలిగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుంది: CM

AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వాసితులందరినీ ఆదుకుంటామని CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని ఫీడర్ కాల్వ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తూరు పొలాల్లో ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం చెక్కులు అందించారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల ప్రజల తలరాతను మారుస్తుందన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఫీడర్ కాల్వ లైనింగ్ పనులపై సీఎం సీరియస్ అయ్యారు. జులై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేదంటే సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. CI ఫ్రెండ్ సురేష్ అరెస్ట్
AP· 27 Jun 2026

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. CI ఫ్రెండ్ సురేష్ అరెస్ట్

AP: సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. పరారీలో ఉన్న CI నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. సాయికృష్ణ లాకప్‌డెత్ అనంతరం డెడ్‌బాడీని మాయం చేయడంలోనూ, కుటుంబసభ్యులతో రాజీకి రాయబారం నడపడంలోనూ CI నాగరాజుకు సురేష్ సహకరించినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిల కోసం సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

కిడ్నాప్ చేసి.. తలకిందులుగా వేలాడదీసి దాడి
AP· 27 Jun 2026

కిడ్నాప్ చేసి.. తలకిందులుగా వేలాడదీసి దాడి

AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ పోలవరం గ్రామానికి చెందిన తమ్మిలేటి అంజిబాబు అనే వ్యక్తి అదే గ్రామంలో పందెంకోడి పుంజులను దొంగిలించాడనే నెపంతో కొంతమంది యువకులు దాడిచేశారు. అంజిబాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడతీసి కొట్టినట్లు సమాచారం. బాధితుడు చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు రోడ్డెక్కారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం చేస్తూ దాడిచేసిన వారికే కొమ్ము కాస్తున్నారని PS ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు.

రోడ్డెక్కిన అవుట్‌సోర్సింగ్ టీచర్లు.. మంత్రి ఇంటి ముట్టడి
AP· 27 Jun 2026

రోడ్డెక్కిన అవుట్‌సోర్సింగ్ టీచర్లు.. మంత్రి ఇంటి ముట్టడి

AP: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిని ముట్టడించారు. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించడం దారుణమన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. న్యాయం చేయండి.. మా ఉద్యోగాల్ని కాపాడండి అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో DSC-2025 వల్ల తమ ఉద్యోగ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుండటంతో 40రోజులుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు.

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం
AP· 26 Jun 2026

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం

AP: నెల్లూరు బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండుగతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కోర్కెలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ప్రసిద్ధ స్వర్ణాల చెరువు ఘాట్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. AP ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదురోజుల పాటు వివిధ రకాల సంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి. పండుగ ప్రారంభమైన తొలిరోజే దాదాపు 3లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అవనిగడ్డ డిపోలో బస్సులు నిలిపివేత
AP· 25 Jun 2026

అవనిగడ్డ డిపోలో బస్సులు నిలిపివేత

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెచ్చిన ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల RTC సిబ్బంది, మహిళా ప్రయాణికుల మధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మహిళా ప్రయాణికులు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సు సర్వీసులను నిలిపివేశారు. డిపో గేటు వద్దే నిరసనకు దిగడంతో వందలాది మంది ప్రయాణికులు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు బస్టాండ్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై కొందరు మహిళలు దాడులు చేస్తున్నారని, తమకు కనీస రక్షణ కరువైందని వాపోయారు.