Latest

స్కూళ్లలో Fire Safety ఉండాల్సిందే..
TG : నిర్మల్ జిల్లాలోని స్కూల్, కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నియమాలు సరిగ్గా అమలు చేయాలని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ దారులు లేని విద్యాసంస్థలపై విద్యా, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే వెళ్లి తనిఖీలు చేయాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం చేసి స్పందించకపోతే విద్యార్థుల రక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

STPCలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
TG: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ల పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జీఎం నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్. విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు తాటిపర్తి సాయికృష్ణ మాట్లాడుతూ పవర్ మెక్ కంపెనీ కార్మికులకు రావాల్సిన ఇంక్రిమెంట్లను చెల్లించాలని కోరారు.
నూకపల్లిలో అంగన్వాడీ కేంద్రం పరిశీలన
TG: జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. కేంద్రంలో చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.

‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరణ
TG: జగిత్యాల జిల్లా ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకుడు దామెర రామ్ సుధాకర్రావు మాట్లాడుతూ సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 23న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

డంపు యార్డ్ జీవో రద్దు కోసం పోరాటం
TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన డంపియార్డు జీవో రద్దు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్లో ఆయనను కలిసిన సిద్దాపూర్ డంపు యార్డ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్, తిరుమలయ్య తదితరులు డంపు యార్డ్ పై చేస్తున్న పోరాటంలో తమకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. 10 గ్రామాలను నష్టం చేసే ఈ డంపు యార్డ్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
TG: జోన్-III ఇన్చార్జ్ డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో చర్చించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల ఏర్పాటును పెంచాలని ఆదేశించారు.

ఆగస్టు 30, 31 తేదీల్లో KVPS జిల్లా శిక్షణా తరగతులు
కుల వివక్ష లేని సమాజం, సామాజిక న్యాయం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 30, 31 తేదీలలో 'జిల్లా సామాజిక శిక్షణా తరగతులు' నిర్వహించనున్నారు. ఈ తరగతులను జయప్రదం చేయాలని KVPS ప్రతినిధులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ హాజరుకానున్నారు. KVPS వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు రాయల్స్ నవీన్ కుమార్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.

స్కూల్ కి కలెక్టర్ విజిట్.. 100 బెంచీలు మంజూరు
TG : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. క్లాస్ రూమ్లను చూసి, పిల్లల చదువులు, ఉపాధ్యాయులు చెప్పే విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు 100 డ్యూయల్ డెస్క్ బెంచీలను మంజూరు చేశారు. Govt స్కూళ్లను బాగు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో MPDOతో పాటు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు..

తెలంగాణాకు CJP ’స్కూల్ ఠీక్ కరో’ సెగ?
CJP నడుపుతున్న స్కూల్ ఠీక్ కరో ఉద్యమ సెగ తెలంగాణా సర్కారును తాకినట్లుంది. ఎక్కువ జిల్లాల్లో కలెక్టర్లు బడిబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల విద్యార్థుల స్థితిగతులు బోధనా పద్ధతులు, తరగతి గదులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలకు 100 డ్యూయల్ డేస్కు బెంచీలను మంజూరు చేయించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

పంచదార(చక్కెర) నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్
కొద్ది రోజులుగా పంచదార(చక్కెర) ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో సప్లై తగ్గినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ టైంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే ఏ బల్క్ వినియోగదారుడైనా 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోకూడదని ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ రూల్స్ అమల్లోకి ఉంటాయని చెప్పింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది.

ఈ నెల 24న ఆటోల బంద్
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని, అలాగే ఆర్టిసికి విద్యుత్ ఆటోలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే మూడు ప్రధాన డిమాండ్లతో ఈనెల 24న తెలంగాణాలో ఆటో డ్రయివర్లు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు బంజర ఆటో డ్రైవర్ సంఘం, జేఏసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ పాల్గొని బందుకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారరు. ఈ కార్యక్రమం జే.పుల్లారావు అధ్యక్షతన జరిగింది.

నిధుల దుర్వినియోగంపై సర్పంచ్కు షోకాజ్ నోటీస్
TG: కామారెడ్డి జిల్లా ఫరీద్పేట్ గ్రామపంచాయతీలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో శానిటేషన్ పనులకు సంబంధం లేని ‘ఓం సాయి ఎలక్ట్రికల్స్’ సంస్థకు రూ.48,670 చెల్లించినట్లు అధికారులు జరిపిన విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసి అధికారులు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
రాజంపేటలో దారుణ హత్య
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. చిలకాల పెంచలయ్య అనే వ్యక్తిని సాధుశెట్టి కత్తితో దాడి చేసి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫీజు బకాయిలపై బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
TG: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ‘ఫీజు బకాయి..బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం మంత్రికి వినతి
TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పరావుపేటలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సర్పంచ్ మేకల పోచయ్య ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

మంచిర్యాలలో జోరుగా భూముల రీసర్వే
మంచిర్యాల జిల్లాలోని ఎంపిక చేయబడిన గ్రామాలలో భూముల రీసర్వే జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి, ఆయేపెల్లి గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును మండల తహసీల్దార్ రాఘవేంద్రతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే పనుల పురోగతి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా కొనసాగుతుందని, రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.

కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూప రెడ్డి హత్యపై నిరసన
కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూపారెడ్డి హత్యను ఖండిస్తూ, జడ్చర్లలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంఈఓ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్చర్ల తహసీల్దార్ (ఎంఆర్వో)కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.

పెన్షన్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
TG : పింఛన్ రావడం లేదని కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కాడు. రెండు గంటల పాటు ట్యాంక్పైనే ఉన్న ఆయనను పోలీసులు, గ్రామస్తులు నచ్చజెప్పి కిందకు దించారు. గతంలో వచ్చిన పెన్షన్ ఇప్పుడు రావడం లేదని, అర్హత ఉన్నా ఇవ్వడం లేదని రాములు బాధపడ్డారు. సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పింఛన్ ఆగిపోయినట్లు స్థానికులు చెప్పారు. సమస్య తీర్చకపోతే ప్రాణాలు తీసుకుంటానని రాములు అనడంతో అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఊరి జనం కోరుతున్నారు.

తెలకపల్లి మండలంలో 7566 మంది ఓటర్లకు నోటీసులు
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తెలకపల్లి మండలంలో 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితా మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో 582 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 6,974 మంది అనామలీస్ ఓటర్లను గుర్తించి మొత్తం 7,566 నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభకు ఆహ్వానం
నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారం కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభ కరపత్రాన్ని సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 23న వినుకొండలోని సీపీఎం కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించనుండగా, ప్రజా కళామండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

బస్సు రాకపోవడంతో గ్రామస్తుల కష్టాలు!
TG : జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు వచ్చేలా చూడాలని ఊరి జనం కోరుతున్నారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్తులు మూడు రోజులు ధర్నా చేయగా, డిపో మేనేజర్ బస్సు నడుపుతామని మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు రాత్రి బస్సు ఊర్లోకి రావడం లేదని ప్రజలు, యువకులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా PDS అధ్యక్షుడు హలీం పాషా మరోసారి డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.