Latest

విద్యార్థులకు సేఫ్ ఎడ్యుకేషన్ కావాలి: ట్రస్మా
TG: విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ట్రస్మా కామారెడ్డి జిల్లా ప్రతినిధులు పోలీసులను కోరారు. కామారెడ్డి జిల్లాలో ట్రస్మా ప్రతినిధులు సీఐ నరహరిని కలిసి విద్యార్థుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందించారు. పాఠశాలలకు సమీపంలో విద్యార్థులు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలని కోరారు. విద్యార్థుల్లో సమస్యాత్మక ప్రవర్తన కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి సరైన మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: TSUTF
నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమైనది, ఆందోళనకరమైనదని పేర్కొంది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని లోపాలను సరిదిద్దుతూ, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తారని, వారి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం గౌరవభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యాసంస్థల్లో భద్రతను పెంపొందించడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రూ.2.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
TG: సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం, పాశం మైలారం, చిట్కుల్ ప్రాంతాల్లో సుమారు రూ.2.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రజలకు రాకపోకలు, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడటమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద కూరగాయల వాహనం బోల్తా
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి NH61 పై కూరగాయల వాహనం బోల్తా పడింది. మహారాష్ట్ర బిలోలి నుండి నిర్మల్ వైపు వస్తున్న ఈ వాహనం మార్గమధ్యలో బోల్తా పడటంతో కూరగాయలు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్తోపాటు మరొకరికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఆగిర్యాల శేఖర్(26) మృతిచెందాడు. బైక్పై షాద్నగర్ నుంచి గ్రామానికి వెళుతుండగా ఎల్ఎన్టి పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

మాసాయిపేట్లో బోనాల వైభవం
TG: మెదక్ జిల్లా మాసాయిపేట్ మండల కేంద్రంలో ఆదిశంభవంతులు(మాదిగ) వైభవంగా నల్ల పోచమ్మకు బోనాలు సమర్పించారు. మాసాయిపేట గ్రామ పెద్దలు మాట్లాడుతూ తరతరాల నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని, కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు సర్పంచ్ కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి
TG: మాల కోఆర్డినేషన్ ఫోరం (MCF) జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించి శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో మాల సంఘం నాయకులతో కలిసి ఎంసీఎఫ్ జేఏసీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మాల సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

'మేం Chinese కాదు.. Indians'.. చిన్నారి టింకిల్ మాటలు వైరల్
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నారి టింకిల్ గోంగో మాటలు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి. “మేం చైనీయులం కాదు.. భారతీయులం. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి” అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటానగర్కు చెందిన టింకిల్ పోలీసు ఉద్యోగి కూతురు. ఆర్మీ యూనిఫాంలో ‘జనగణమన’ పాడిన ఆమె పాత వీడియో కూడా వైరల్గా మారింది. చైనీస్ అని పిలిస్తే తనకు కోపం వస్తుందని, తమను భారతీయులుగా పిలవాలని ఆమె కోరింది. దీంతో చిన్నారి వీడియోపై నేషనల్ మీడియా ఫోకస్ చేసింది.

ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపు
TG: ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆటో కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాల్ల హరీష్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంద్కు మద్దతుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

ఆదివాసులుగా గుర్తించాలి.. మా భూములు మాకు ఇవ్వాలి
AP: తమను ఏజెన్సీ ఆదివాసులుగా గుర్తించి, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజనులు డిమాండ్ చేశారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల, బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగుజ తదితర గ్రామాలతో పాటు పలు కొండశిఖర ప్రాంతాల్లో వేలాది మంది ఆదివాసులు జీవిస్తున్నారని తెలిపారు. తమ భూముల్లో సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేర్లు నమోదయ్యాయని ఆరోపించారు.

యాదగిరిగుట్టలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
TG: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి రుసుము లేకుండా దేవస్థానం తరఫున పూజా సామగ్రి, అవసరమైన పాత్రలను సమకూర్చారు. ఈ వ్రతాల్లో సుమారు 200 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.

భూమి మన్ను కాదు.. రైతన్నకు గుండెకాయ: మంత్రి పొంగులేటి! 🌾
TG : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లిలో జరుగుతున్న భూ సర్వేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అక్రమాలకు చోటు లేకుండా ప్రతి అంగుళం కొలవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 'భూమి అంటే కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ' అని మంత్రి అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బేతుపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నాలజీతో ఈ భూ సర్వే చేపడుతున్నామని తెలిపారు.
CJP నేతలపై దాడి.. కాళ్ళు, చేతులు విరగ్గొట్టారు!
రాజస్థాన్లో CJP నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆశుతోష్ రాంక మరియు వాలంటీర్లపై దాడి జరిగింది. గేదెల కొట్టంలో నడుస్తున్న స్కూల్ను బాగుచేయడానికి వెళ్లగా, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాలతోనే BJP గుండాలు ఈ అటాక్కు పాల్పడ్డారని <a href="https://www.theclearcutnews.com/n/8ASbtUa">ఆశుతోష్</a> ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్లో వాలంటీర్ల చేతులు విరిగిపోయాయని, మహిళల ఫోన్లు పగలగొట్టారని, వెహికల్స్ను ధ్వంసం చేశారని తెలిపారు. స్పాట్లో ఉన్న పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ప్రొటెస్ట్ తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కలెక్టరేట్ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లోని విస్తృతంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత శాఖలు చేపట్టాలని ఆదేశించారు. ఊటకుంటను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూడీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మొక్క నాటి, క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

Blackmail Politics ఎన్నాళ్లు చేస్తారు: MLA నాయిని రాజేందర్
TG: కొండా సురేఖ పార్టీలో, ప్రభుత్వంలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదని వరంగల్ వెస్ట్ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిపోలేదా? అని నిలదీశారు. కొండా సురేఖపై AICC కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తీరును ప్రజలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని మంత్రి పదవులు ఇచ్చినా ఇంతకాలం ఊరుకున్నామని అన్నారు.

అండర్ బైపాస్ నిర్మించాలని రైల్వే జీఎంకు ఎంపీ వినతి
TG: రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారీ వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ రైల్వే గేటు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ గురువారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. రైల్వే గేటు వద్ద తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ వివరించారు.

కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం
AP: కాకినాడ జిల్లా కరప మండలంలో ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగినా, అందుకు అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులోకి రాలేదు. వేలంగి నుంచి నడకుదురు వరకు సుమారు 15 గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చోటులేక ఫుట్బోర్డులపై ప్రమాదకరంగా నిలబడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు హెచ్చరిస్తున్నా కాలేజీ సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రయాణిస్తున్నారు.

‘వందేమాతరం’ మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అందరికీ సరిపోయేవి
‘వందేమాతరం’పై కొనసాగుతున్న చర్చలో సీనియర్ నటి శర్మిలా ఠాగూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ గీతంలోని మొదటి రెండు స్టాంజాలు మాత్రమే పాడాలని ఆమె అన్నారు. భారతదేశం వివిధ మత విశ్వాసాలు ఉన్న ప్రజలకు నెలవు అని, కొంతమంది ఒకే దేవుణ్ణి ఆరాధించే విశ్వాసాలను కలిగి ఉంటారని అన్నారు. పాటలోని తరువాతి భాగాల్లో కాళి, దుర్గ వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉండటం వల్ల కొన్ని సమాజాల విశ్వాసాలకు అవి సరిపోకపోవచ్చని చెప్పారు. మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అన్ని మతాల ప్రజలకు సరిపోయేవి అని అభిప్రాయపడ్డారు.

CJP ఆశుతోష్ రాంకపై అటాక్!
రాజస్థాన్లో <a href="https://www.theclearcutnews.com/n/anxNZyh">CJP కో-కన్వీనర్</a> ఆశుతోష్ రంకా మరియు పార్టీ వాలంటీర్లపై దాడి జరిగింది. ఈ అటాక్లో ఆశుతోష్తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, వారు ప్రయాణిస్తున్న కార్ విండో గ్లాసులను కొందరు పూర్తిగా ధ్వంసం చేశారు. BJP కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని CJP వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ కళ్లముందే ఈ ఇన్సిడెంట్ జరిగినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని CJP ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2090662536496685145?s=20">అభిజిత్ దీప్కె</a> విమర్శించారు.
అనంతగిరిలో ఆదివాసీ గిరిజనుల పాదయాత్ర
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొండ శిఖర గ్రామాల్లో ఉంటున్న గిరిజనులను ఏజెన్సీ ప్రాంత గిరిజనులుగా గుర్తించి, వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర నిర్వహించారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగిజ తదితర గ్రామాల మీదుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగింది. గిరిజనులు జాతీయ జెండాలను చేతబట్టి, డోలీలు, అడ్డాకులతో పాదయాత్రలో పాల్గొన్నారు.