Latest

గ్రామాల్లో దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చేలా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అలురు, బోరేగావ్, సాయినగర్ తండా గ్రామాల్లో గెజిటెడ్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించారు. హెచ్వో మౌనిక గ్రామాల్లో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలురు గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రకళ పరమేష్ తదితరుల దరఖాస్తులను తనిఖీ చేశారు.

కార్లలో డేంజరస్ కెమికల్స్!
కార్ల లోపల ఉన్న గాలిలో క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయన్న వార్తలపై ICMR రీసెర్చ్ చేస్తోంది. 2015-2022 మోడల్ కార్లలో జరిపిన అధ్యయనంలో 99% వెహికల్స్లో 'TCIPP' అనే డెంజరస్ రసాయనాన్ని గుర్తించారు. డ్రైవర్లపై వీటి ప్రభావం తెలుసుకునేందుకు 3 ప్రాంతాల నుంచి 180 శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ అధ్యయనంపై లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ICMRను NGT ఆదేశిస్తూ, విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.

ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపు
TG: ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20న సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల నుంచి రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

డ్రాగ్ ఆర్టిస్టులు తీసుకొస్తున్న ఒక గొప్ప మార్పు!
మన దేశంలోని డ్రాగ్ ఆర్టిస్టులు విదేశీ పాటలను పక్కనపెట్టి, మన ప్రాంతీయ సంగీతం, జానపద కళలతో వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఒక వేడుకలో 'ట్రిక్సీ ప్రేమా' అనే కళాకారుడు 'బాహుబలి' పాటకి డ్యాన్స్ చేశారు. మన పద్ధతిలో ఇస్తున్న ఈ ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జానపద కళల్లో పురుషులు స్త్రీ పాత్రలు, స్త్రీలు పురుష పాత్రలు వేయడం మన సంస్కృతిలో భాగమే. అదే పరంపరను వీరు కొనసాగిస్తూ, తమ డ్యాన్స్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే మంచి సందేశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

శ్రీలంకపై భారత్ జోరు.. 165 పరుగుల భారీ గెలుపు!
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ చేసి 165 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462, రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు.

అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్
TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాన్ని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫామ్పాండ్, చేపల చెరువు, స్టీల్ బ్యాంక్ను పరిశీలించారు. అనంతరం డస్ట్బిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులకు పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీఓ, డీఆర్డీఓ, ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.
స్టైఫండ్ కోసం రోడ్డెక్కిన డాక్టర్లు.. గుంటూరులో ర్యాలీ
AP: స్టైఫండ్ పెంపు కోసం గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు. స్టైఫండ్ను 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య సేవల్లో ఎదురవుతున్న పని ఒత్తిడి, విధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా స్టైఫండ్ను పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

గ్రీస్లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి?
సన్ రైజర్స్ హైదరాబాద్ CEO కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నవంబర్ 10న గ్రీస్లో వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల అనిరుధ్ మేనమామ వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్కి త్వరలోనే పెళ్లి జరగనుందని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TIMSలో ఉద్యోగాలు.. నెలకు రూ.19,500 జీతం!
TG: సనత్నగర్ TIMS హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డా. సాయినారాయణ గౌడ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, DCA అర్హత ఉన్నవారికి నెలకు రూ.19,500 వేతనం అందించనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెల 21న ఉ. 11 గం. నుంచి సా. 5 గంటల వరకు సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గరలోని NTPC బిల్డింగ్ 4th ఫ్లోర్ DMHO ఆఫీసులో Interviewలకు హాజరుకావాలన్నారు. ఎంపిక జాబితాను ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

తెలుగు నేర్చుకుంటూ ఆనందిస్తున్నా : సొనాలి కులకర్ణి
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాతో నటి సొనాలి కులకర్ణి టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు భాష నేర్చుకుంటున్నానని, ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ తనని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించిందని, హైదరాబాద్ సొంత ఇంటిలా అనిపిస్తోందని తెలిపారు. షూటింగ్ సమయంలో ముద్దపప్పు తన ఫేవరెట్ ఫుడ్గా మారిందని అన్నారు.

మరణశిక్ష పిటిషన్పై సుప్రీంకోర్టు రియాక్షన్!
ఉరిశిక్షకు బదులుగా తక్కువ టైమ్లో ప్రాణం తీసే ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షలు వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని, ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉరికి 40Min పడుతుందని, ఇంజెక్షన్తో 5 నిమిషాల్లో ముగించవచ్చని పిటిషనర్ వాదించారు. అయితే, ఆల్టర్నేటివ్ పద్ధతులపై సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటే భవిష్యత్తులో పరిశీలించవచ్చని, ప్రత్యామ్నాయాలపై కమిటీ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ పేర్కొంది.

నూతన విద్యుత్ సబ్స్టేషన్కు భూమిపూజ
AP: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేశారు. కన్స్ట్రక్షన్ ఈఈ శ్రీధర్, హిందూపూర్ డివిజన్ ఆపరేషన్ ఈఈ చంద్రనాయక్, డీఈఈ నాగన్న, గుండుమల సర్పంచ్ చంద్రప్పతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. నూతన సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే గుండుమలతో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెరుగుతుందన్నారు.

దళిత భూములకు మాత్రమే హెచ్చరిక బోర్డులా?
AP: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సాదువారిపల్లెలోని సర్వేనెంబర్ 67లో ఉండే 173.04 సెంట్లు సాధువారిపల్లె దళితుల అధీనంలో ఉండగా పుల్లంపేట మండలం రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం దారుణమని అఖిల భారత అంబేద్కర్ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ పెంచలయ్య అన్నారు. ఆ సర్వే నెంబర్లో ఉండే భూములను కొందరు అగ్రవర్ణానికి చెందినవారు ఆక్రమించి సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారన్నారు. దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

క్యాన్సర్పై కొత్త CRISPR ప్రయోగం! 🧬
క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రత్యేక మార్పులను టార్గెట్ చేసే కొత్త CRISPR ఎంజైమ్పై రీసెర్చ్ జరుగుతోంది. ఈ ఎంజైమ్ క్యాన్సర్ కణాల DNAను దెబ్బతీయగల సామర్థ్యాన్ని చూపించినట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. అయినా, క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసే కొత్త ట్రీట్మెంట్లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది మనుషుల్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత సేఫ్ అనేది తెలియాలంటే ఇంకా రీసెర్చ్ అవసరం.

ఆటోలు, క్యాబ్లు రోడ్డెక్కవు.. ఆగస్టు 24 నుంచి సమ్మె!
TG: రాష్ట్రంలో ఆటో, యాప్ ఆధారిత క్యాబ్లు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఆగస్టు 24న సమ్మెకు సిద్ధమయ్యారు. రవాణా కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని తెలంగాణ స్టేట్ ఆటో, యాప్ బేస్డ్ యూనియన్స్ JAC ఆరోపించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఆటో డ్రైవర్ల ఇన్కమ్ తగ్గిందని తెలిపింది. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు JAC ప్రకటించింది. డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12 వేలు అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డబ్బాలు తీశారు.. దుకాణాలు వదిలేశారు
TG: చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించి.. పెద్ద దుకాణ సముదాయాలను మాత్రం వదిలేయడంపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ కూడలి విస్తరణలో భాగంగా రహదారులపై ఆక్రమణలను జేసీబీలతో తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించినా, పెద్ద వ్యాపారుల దుకాణ సముదాయాల వద్ద మార్కింగ్ చేసి వదిలేయడంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దయనీయ స్థితిలో మెదక్ జిల్లా తండాలు
TG: మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ సదాశివనగర్ తండా, పర్వతాపూర్ గ్రామపంచాయతీ బాపనయ్య తండా, కాట్రియాల గ్రామపంచాయతీ పనియా తండా, కిషన్ తండా, కాట్రియాల తండా నుంచి కిషన్ తండాకు వెళ్లే దారి, జెమ్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర తండా, బిల్య తండా, సుభాష్ తండా, బిక్షపతి తండాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రహదారులు లేక ప్రజలు బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. టూవీలర్స్, ఆటోలు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

యాప్ వచ్చినా..యూరియా కష్టాలు తీరలేదన్నా!
TG: యూరియా కోసం యాప్లో బుక్ చేసుకున్నారు. బుకింగ్ సక్సెస్ అంటూ చూపించింది. తీరా యూరియా తీసుకునేందుకు దుకాణానికి వెళ్తే స్టాక్ లేదు అంటూ సమాధానం వస్తోంది. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఒకవైపు యాప్లో బుకింగ్ చేసుకోవడం, మరోవైపు దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెయ్యి పేరుతో పామాయిల్.. హైదరాబాద్లో భారీ దందా!
TG: హైదరాబాద్లో కల్తీ నెయ్యి తయారీ, అమ్మకాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. సిటీలోని 130 సెంటర్లలో తనిఖీ చేయగా, పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లతో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. 36 టన్నుల కల్తీ నెయ్యి, రా మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. 10-40 శాతం కల్తీతో తయారైన నెయ్యిని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు సప్లై చేస్తున్నట్లు తేలింది. DCP గైక్వాడ్ వైభవ్, హైదరాబాద్ CP సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

శీర్ష గ్రామంలో పెద్దపులి సంచారం.. హైఅలర్ట్
TG: కొమురంభీమ్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చెరువు వద్ద, పత్తి చేనుల్లో పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించారు. పులి ప్రస్తుతం కంకాలమ్మ గుట్ట వైపు వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో కంకాలమ్మ ఆలయం వైపు ప్రజలు, భక్తులు వెళ్లవద్దని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి
AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇప్పించాలని రైతులు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు రౌతులపూడి టీడీపీ యువ నాయకుడు పైల వేణు రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించారు. రైతుల సమస్యను సానుకూలంగా విన్న జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు.