AP

బతకాలి అన్న ఆశే నన్ను కాపాడింది
AP· 8 Jul 2026

బతకాలి అన్న ఆశే నన్ను కాపాడింది

AP: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. తప్పిపోయిన ఆరుగురు జాలర్ల ఆచూకీ ఇంకా దొరకలేదు. కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని కిమ్స్‌ ఐకాన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు భారీ అల మా బోటును ఒక్కసారిగా తాకడంతో బోటు తిరగబడింది. సముద్రంలో చుట్టూ చీకటి, ప్రకృతి వాయుగుండంగా మారడంతో భయమేసిందన్నారు. అయిన వాళ్లు ఒక్కొక్కరుగా కళ్లముందే దూరమైపోతున్నా, బతకాలి అన్న ఆశతో శక్తినంతా పోగుచేసుకుని 9గంటలు ఈదగా ఓ నౌక సిబ్బంది తనను కాపాడారని తెలిపాడు.

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
AP· 8 Jul 2026

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

AP: విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ సాయం అందించనుంది. చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులు తిరిగి వస్తున్న క్రమంలో ఈ నెల 4న వారి బోటు గల్లంతైంది. బోటులో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఒకరు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఆరుగురు సముద్రంలో గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకలేదు. గల్లెంతైనవారి కోసం కోస్ట్ గార్డ్‌లు, పోలీసులు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తిరుమల బస్సులు బంద్
AP· 7 Jul 2026

తిరుమల బస్సులు బంద్

AP: తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ AC బస్సులను అలిపిరి డిపోలో నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన చేశారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని, 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. తిరుమలకు నడిచే ఎలక్ట్రిక్ AC బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు వలన రాబోయే రోజుల్లో APSRTC ప్రైవేటీకరణ వైపు వెళ్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

సూసైడ్ కేసులో ట్విస్ట్..  CI నాగరాజుపై అట్రాసిటీ కేసు
AP· 7 Jul 2026

సూసైడ్ కేసులో ట్విస్ట్.. CI నాగరాజుపై అట్రాసిటీ కేసు

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రాంతికుమార్ సూసైడ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ CI నాగరాజుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలకంగా మారింది. తన చావుకు CI నాగరాజు కారణమని, ఆయన పెట్టిన టార్చర్ భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని క్రాంతికుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఆధారాల పరిశీలన అనంతరం, అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసులో చేర్చారు. CIపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు..  APకి కరువు ముప్పు
AP· 7 Jul 2026

ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు.. APకి కరువు ముప్పు

AP: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. వర్షాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు పడిపోవడమే కాక.. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.810 TMCలు కాగా.. ప్రస్తుతం 42.213 TMCలే ఉన్నాయి. నిరుడు వరదలు పోటెత్తడంతో ఇదే సమయానికి దాదాపు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. 3.95 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం నీటి ప్రవాహం లేక వెలవెల బోతుంది.

సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు
AP· 5 Jul 2026

సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు

AP: సముద్రంలో ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరి సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 9మంది మత్స్యకారులు బోటు ఇంజిన్ ఆగిపోవడంతో సముద్రంలోనే చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని, తమను కాపాడాలని మత్స్యకారులు వీడియో సందేశం ద్వారా తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. కలెక్టర్.. కోస్ట్‌గార్డ్ బృందాల సాయంతో మత్స్యకారులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.