Latest

నిధుల దుర్వినియోగంపై సర్పంచ్కు షోకాజ్ నోటీస్
TG: కామారెడ్డి జిల్లా ఫరీద్పేట్ గ్రామపంచాయతీలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో శానిటేషన్ పనులకు సంబంధం లేని ‘ఓం సాయి ఎలక్ట్రికల్స్’ సంస్థకు రూ.48,670 చెల్లించినట్లు అధికారులు జరిపిన విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసి అధికారులు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
రాజంపేటలో దారుణ హత్య
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. చిలకాల పెంచలయ్య అనే వ్యక్తిని సాధుశెట్టి కత్తితో దాడి చేసి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫీజు బకాయిలపై బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
TG: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ‘ఫీజు బకాయి..బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం మంత్రికి వినతి
TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పరావుపేటలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సర్పంచ్ మేకల పోచయ్య ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

మంచిర్యాలలో జోరుగా భూముల రీసర్వే
మంచిర్యాల జిల్లాలోని ఎంపిక చేయబడిన గ్రామాలలో భూముల రీసర్వే జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి, ఆయేపెల్లి గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును మండల తహసీల్దార్ రాఘవేంద్రతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే పనుల పురోగతి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా కొనసాగుతుందని, రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.

కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూప రెడ్డి హత్యపై నిరసన
కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూపారెడ్డి హత్యను ఖండిస్తూ, జడ్చర్లలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంఈఓ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్చర్ల తహసీల్దార్ (ఎంఆర్వో)కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.

పెన్షన్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
TG : పింఛన్ రావడం లేదని కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కాడు. రెండు గంటల పాటు ట్యాంక్పైనే ఉన్న ఆయనను పోలీసులు, గ్రామస్తులు నచ్చజెప్పి కిందకు దించారు. గతంలో వచ్చిన పెన్షన్ ఇప్పుడు రావడం లేదని, అర్హత ఉన్నా ఇవ్వడం లేదని రాములు బాధపడ్డారు. సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పింఛన్ ఆగిపోయినట్లు స్థానికులు చెప్పారు. సమస్య తీర్చకపోతే ప్రాణాలు తీసుకుంటానని రాములు అనడంతో అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఊరి జనం కోరుతున్నారు.

తెలకపల్లి మండలంలో 7566 మంది ఓటర్లకు నోటీసులు
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తెలకపల్లి మండలంలో 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితా మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో 582 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 6,974 మంది అనామలీస్ ఓటర్లను గుర్తించి మొత్తం 7,566 నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభకు ఆహ్వానం
నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారం కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభ కరపత్రాన్ని సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 23న వినుకొండలోని సీపీఎం కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించనుండగా, ప్రజా కళామండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

బస్సు రాకపోవడంతో గ్రామస్తుల కష్టాలు!
TG : జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు వచ్చేలా చూడాలని ఊరి జనం కోరుతున్నారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్తులు మూడు రోజులు ధర్నా చేయగా, డిపో మేనేజర్ బస్సు నడుపుతామని మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు రాత్రి బస్సు ఊర్లోకి రావడం లేదని ప్రజలు, యువకులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా PDS అధ్యక్షుడు హలీం పాషా మరోసారి డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.
దారితప్పిన ఏనుగు.. రాత్రంతా బీభత్సం
ఓ ఏనుగు తన మంద నుంచి వేరుపడింది. దారి తప్పింది. పలమనేరు రూరల్ మండలంలోని ఇందిరానగర్ పంట పొలాల్లోకి వెళ్లింది. అర్థరాత్రి తరువాత గుడియాత్తం రోడ్డుపైకి ఎక్కి, భయంకరంగా అరుస్తూ అక్కడున్న ట్రాకర్స్పైకి దూసుకెళ్లింది. గ్రామస్తులు, రైతులంతా ఆ ఏనుగును టపాసులు, బాణాలు, ఔట్లు పేల్చుతూ ఏనుగును పొలాల మీదుగా, రోడ్డు పక్కనే ఉన్న అడవి వైపు మళ్లించారు. గతంలో ఏర్పాటు చేసిన హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ను విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ఏనుగు కాళ్లతో తొక్కి ధ్వంసం చేసింది.

పిచ్చికుక్కల భయం.. 15 మందికి తీవ్ర గాయాలు!
AP : నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో పిచ్చికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. 15 మందిపై దాడి చేసి కాళ్లు, చేతులు, చెవులను తీవ్రంగా గాయపరిచాయి. బాధితులు ప్రస్తుతం వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధికుక్కల సంఖ్య బాగా పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలుగురు ఎస్ఐల బాధ్యతల స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగాళ్లపల్లి ఎస్ఐ అశోక్, ఇల్లంతకుంట ఎస్ఐ ఉపేంద్ర చారి, వేములవాడ రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, కొనరావుపేట ఎస్ఐ రామ్మోహన్ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది
చంద్రబాబు పర్యటన కోసం చిరు వ్యాపారులపై బుల్డోజర్
తమ హంగూ ఆర్భాటాల కోసం చిన్నోళ్లపై బుల్డోజర్లను నడిపే సంస్ర్కుతి టిడిపికి కూడా పాకింది. చంద్రబాబు పర్యటన కోసం వస్తున్నడని, చిరు వ్యాపారుల షాపులపై టిడిపి నేతలు బుల్డోజర్లు నడిపించారు. షాపులను కూల్చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఏ కోడూరులో జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనడానికి సిఎం చంద్రబాబు రేపు హెలికాప్టర్లో వస్తున్నారు. హెలీ ప్యాడుకు ఎలాంటి ఆటంకం లేకపోయినా సమీపంలో ఉన్న షాపులన్నింటినీ బుల్డోజర్లతో కూలగొట్టారు.

టీచర్ ఉద్యోగాల అమ్మకం.. జగన్ సంచలన ఆరోపణలు!
AP : Sports కోటా పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్నారని YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ప్రత్యేక జీవోలు జారీ చేశామని చంద్రబాబు, లోకేష్ అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. పీవీ సింధు పేరు చెప్పి దీన్ని సమర్థించుకుంటున్నారని, కానీ ఉద్యోగాలు అమ్ముకోవడానికే జీవో నెం 4, 47 ఇచ్చారని విమర్శించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ జీవో నెం 23, 56 జారీ చేశారని జగన్ అన్నారు.

పడిపోనున్న రూపాయి వ్యాల్యూ?
వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇండియా ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరిగింది. పెట్రోలియం మినిస్ట్రీ డేటా ప్రకారం ఏప్రిల్-జులై మధ్య నెట్ ఇంపోర్ట్ వ్యాల్యూ ఏకంగా 43.4% పెరిగి $57.8 బిలియన్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడమే దీనికి మెయిన్ రీజన్. దిగుమతి పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా, హై ప్రైసెస్ వల్ల బిలియన్ల కొద్దీ మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఫ్యూచర్లో ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగి, ఇండియన్ రూపీ వ్యాల్యూ పడిపోయే ఛాన్స్ ఉంది.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని తల్లాకొత్తపేట, రామ్నూర్, కప్పట్రావుపేట గ్రామాల్లో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు

విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ ఏది? తనిఖీలు చేపట్టరా? - AIPSU
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని, ఇట్లయితే విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని AIPSU నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల్లో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, పనిచేసే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవన్నారు. DEO, అగ్నిమాపక అధికారులు వెంటనే సంయుక్త తనిఖీలు చేపట్టి, NOC లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తక్షణమే స్పందించకున్నా, పట్టించుకోకపోయినా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

వినుకొండలో ప్రజా దర్బార్
AP : పల్నాడు జిల్లా వినుకొండలోని Chief Whip కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఇందులో Chief Whip జీవీ.ఆంజనేయులు పాల్గొని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, నీళ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై చాలా మంది ఆయనకు చెప్పుకున్నారు. ప్రజల ఇబ్బందులు విన్న చీఫ్ విప్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా
TG: గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే అధికారులతో సమీక్షిస్తూ పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, మల్లారం, రసూల్పల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.