మైనింగ్ అధికారుల పేరుతో దందా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రంగంపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అధికారుల వేధింపులతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, తమను కాపాడాలని వారు కోరారు.



