TG

మైనింగ్ అధికారుల పేరుతో దందా
TG· 23 Jul 2026

మైనింగ్ అధికారుల పేరుతో దందా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రంగంపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అధికారుల వేధింపులతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, తమను కాపాడాలని వారు కోరారు.

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం
TG· 23 Jul 2026

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం

TG: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ప్రతిఒక్కరూ దేశవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ JAC పిలుపునిచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగే ఈ సంఘీభావ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీయువకులు పాల్గొనాలన్నారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు చేసిన లాఠీచార్జీని, నిర్బంధాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది.

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM
TG· 22 Jul 2026

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM

TG: కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో బలహీనపరచాలంటే తన పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేర్లు వేరైనా BRS, BJP రెండూ ఒక్కటేనని విమర్శించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18గంటలు పనిచేసినా నాకు టైమ్ సరిపోవడంలేదన్నారు.

కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్‌లో గర్భిణి తరలింపు
TG· 22 Jul 2026

కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్‌లో గర్భిణి తరలింపు

TG: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద డైవెర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ప్రసవం కోసం పేరూరు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వసంతకు నొప్పులు ఎక్కువ కావడంతో ఏటూరునాగారం హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్స్ రిఫర్ చేశారు. రోడ్డు తెగిపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు. అనంతరం అధికారులు ట్రాక్టర్ ఏర్పాటుచేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించారు.

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు
TG· 22 Jul 2026

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో తాయత్తు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వంటి పూజా సామగ్రి కనిపించడంతో గుప్తనిధుల కోసం పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు.

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత
TG· 22 Jul 2026

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత

TG: గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోజంతా కష్టపడినా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. అగ్రిగేటర్ సంస్థలు అధిక కమీషన్లు, కోత విధిస్తూ డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
TG· 22 Jul 2026

అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మేకల శివకుమార్(21) మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని దేవేందర్ నగర్‌లో ఉంటూ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఫ్రెండ్స్‌తో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వారు తిరిగి అడగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తల్లిదండ్రులను డబ్బు అడిగితే తిడతారనే భయంతో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ SI రాజు తెలిపారు.

వరి, చెరకు సాగుపై అలర్ట్‌
TG· 22 Jul 2026

వరి, చెరకు సాగుపై అలర్ట్‌

TG: ఎల్‌నినో ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రభావం డిసెంబరు వరకు తీవ్రంగా ఉండి, వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖరీఫ్‌ తర్వాత యాసంగి సాగు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. ఆగస్టులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా, సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నెక్కొండ SIపై సస్పెన్షన్ వేటు
TG· 21 Jul 2026

నెక్కొండ SIపై సస్పెన్షన్ వేటు

TG: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ SI మహేందర్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కమిషనర్ శ్వేత క్రమశిక్షణా రాహిత్యం కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంపొందించడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నీళ్లపై కనీస అవగాహన లేదు
TG· 21 Jul 2026

నీళ్లపై కనీస అవగాహన లేదు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల BRS కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 38.16 TMCల నీటిని ఎత్తుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. 22 రిజర్వాయర్లు నింపుతామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడంలేదని ఫైరయ్యారు.