Latest
ఆర్టీసీ బస్సునే దొంగలించిన దుండగుడు
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును వేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు సినిమా రేంజ్ లో బస్సును ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్
AP: 'ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకుగానూ, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం, ఈనెల 24 వరకు నిధుల విడుదుల కొనసాగుతుంది' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి నిజమైన ఆస్తి అని, ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా ఈ సాయం అందించేలా 'తల్లికి వందనం' పథకాన్ని రూపొందించామంటూ మంత్రి లోకేష్ 'X' లో తెలిపారు.

నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు
TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్దనున్న హైవేపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నీట్, పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని చాటిచెప్పిన విప్లవ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి నేడు. ప్రజల స్వేచ్ఛను అణచివేసే నిజాం పాలనకు వ్యతిరేకంగా తన 'కవితల'తో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఉద్యమసారథి మన దాశరథి. జైలు గోడలపైన బొగ్గుతో పద్యాలు రాసి, అన్యాయాలకు ఎదురు నిలిచిన వ్యక్తి. విప్లవ సాహిత్యమే కాకుండా తెలుగు సినిమాలకి కూడా ఎన్నో మరపురాని మధురమైన పాటలను అందించారు.
రెడ్కో డీఈ ఇంట్లో ACB రైడ్స్
TG: హైదరాబాద్లో తెలంగాణ REDCO (రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) DE ముత్యం వెంకటరమణ నివాసాలపై ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణల రావడంతో మాదాపూర్లోని ఆయన ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో ఏసీబీ DSP మాజిదాఖాన్ ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఆకాశంలో GOLD RATES..తులం ఎంతో తెలుసా?
గోల్డ్ రేట్స్ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,46,510కు చేరగా, ఒక్కరోజే రూ.2,290 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,34,300గా ఉంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలకు చేరి, ఒక్కరోజే రూ.5,000 పెరిగింది

ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం: చంద్రబాబు
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్గా మారే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్తోపాటు పాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభిస్తారని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు

సిడ్నీ హీరోగా హైదరాబాద్ వాసి
సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్కు చెందిన రెహ్మత్ పాషా దాదాపు 20 మంది ప్రాణాలను కాపాడారు. గాయపడినవారిని ఆంబులెన్సుల వద్దకు చేర్చిన ఆయన తెగువను మెచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన టోపీని సిడ్నీ మ్యూజియంలో ఉంచనున్నారు. త్వరలోనే ఆయన కుటుంబం కూడా ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లకు కూడా హైదరాబాద్తో సంబంధాలున్నాయి.

తెలుగు గజల్ రచనకు ఆద్యుడు దాశరథి
తెలుగు సాహిత్యంలో గజల్ రచనకు ఆద్యుడిగా నిలిచివారు దాశరథి కృష్ణమాచార్యులు. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది..పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ అంటూ 1965లో తొలిసారి తెలుగు గజల్ రాశారాయన. 14 ఏప్రిల్ 1965లో ఆంధ్రప్రభ వారపత్రికలో ‘ఉగాది గజల్’ అన్న శీర్షికతో అచ్చయింది. 'గజల్' అంటే “ఇంతులతో మంతనాలు" అన్నారు దాశరథి. తెలుగులో గజల్కు దాశరథి ‘మంజరి’ అని పేరు పెట్టారు.

కుటుంబాన్ని బంధించి 66 తులాల బంగారం చోరీ
TG: కరీంనగర్లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ ఘటన కలకలం రేపింది. భగత్ నగర్కు చెందిన వృద్ధుడు అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బంధించి, తుపాకులు, కత్తులతో బెదిరించి 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకెళ్లారు. అరుపులు వినపడకుండా TV సౌండ్ పెట్టి బాధితులను తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన దుండగులు కింద పార్కింగ్లో ఉన్న రెండు బైకులను కూడా దొంగిలించి వేములవాడ బైపాస్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మేకల శివకుమార్(21) మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని దేవేందర్ నగర్లో ఉంటూ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఫ్రెండ్స్తో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వారు తిరిగి అడగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తల్లిదండ్రులను డబ్బు అడిగితే తిడతారనే భయంతో గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్బషీరాబాద్ SI రాజు తెలిపారు.
మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి
దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆయన మాట్లాడారు. విద్యార్థులపై జరిగిన దాడి, వారి ఆందోళనలను అణిచివేయడం వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పోటీపరీక్షల వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారని ఫైరయ్యారు. హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులను కొట్టిన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో బీటెక్ విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న యువతి, లెక్చరర్స్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొంది. గతంలో పరీక్ష హాల్లో సెల్ఫోన్ తీసుకెళ్లిన ఘటనతో పాటు, పరీక్షల సమయంలో తనపై పలు అనుమానాలతో కావాలనే నన్ను టార్గెట్ చేశారని పేర్కొంది. తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నేషనల్ హైవేపై రాస్తారోకో.. జగ్గారెడ్డి అరెస్ట్
TG: ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్యకర్తలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

కరోనా కలకలం.. ఆరోగ్యశాఖ హైఅలర్ట్
APలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకే రోజు గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒకటి చొప్పున మొత్తం 7 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 9 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు నలుగురు మరణించారు. కేసుల పెరుగుదలతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై, 17 బోధనాస్పత్రుల్లో 255 ప్రత్యేక కొవిడ్ పడకలు సిద్ధం చేసింది. మాస్కులు, PPE కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచింది.

ఫోర్జరీ ఆరోపణలపై తమ్మినేనికి చుక్కెదురు
AP: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే కేసులో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొంటూ, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

వరి, చెరకు సాగుపై అలర్ట్
TG: ఎల్నినో ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జూన్లో ప్రారంభమైన ఈ ప్రభావం డిసెంబరు వరకు తీవ్రంగా ఉండి, వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖరీఫ్ తర్వాత యాసంగి సాగు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. ఆగస్టులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా, సెప్టెంబరులో ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

APలో UAE ఫుడ్ క్లస్టర్కు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్లో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు యూఏఈ ప్రభుత్వం APలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబు, UAE మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో APEDB అవగాహన ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు వ్యాల్యూ యాడెడ్ చైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో రూ.100 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.

భూసేకరణలో స్పీడ్ పెంచాలి.. లేదంటే చర్యలు తప్పవు
TG: పారిశ్రామిక పార్కులు, ఎడ్యుకేషనల్ హబ్ల కోసం భూసేకరణపై జిల్లా కలెక్టర్లకు CM రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 30లోగా 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి సేకరణ పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్, ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2028 జూన్ 2 నాటికి కొడంగల్లోని అన్ని రోడ్లు పూర్తి కావాలని, ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను CM ఆదేశించారు.

తెలంగాణలో సైలెంట్గా కరోనా వ్యాప్తి
TG: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. APలో ఇప్పటికే కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందగా, హైదరాబాద్లో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు జరగకపోవడంతో కేసులు నిర్ధారణ కావడం లేదని సమాచారం. తార్నాకకు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందిన ఘటనలో కూడా కొవిడ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు కిట్ల కొరత, ముందస్తు జాగ్రత్తల లోపంపై ప్రజారోగ్య విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త తరహా నేరాలకు చెక్
AP: రాష్ట్రంలో కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. మారిపోతున్న నేరాల స్వభావం, ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 3 రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆమె ప్రారంభించారు. సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసింగ్ను సాంకేతికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణలో 3P విధానం ప్రెడిక్షన్, ప్రికాషన్, ప్రివెన్షన్ అమలు చేయాలని సూచించారు.