Latest
కాన్పూర్లో రోడ్డుపై 18 అడుగుల గొయ్యి
UPలోని కాన్పూర్ నగరంలోని జాజ్మౌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రోడ్డు అకస్మాత్తుగా కుంగి 18 అడుగుల లోతైన, 10 అడుగులు వెడల్పు ఉన్న పెద్ద గొయ్యి ఏర్పడింది. వర్షపు నీరు ఆ గొయ్యిలోకి వేగంగా ప్రవహిస్తూ నిజమైన వాటర్ఫాల్లా కనిపించింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు బ్యారికేడింగ్ చేసి ఈ రోడ్డును మూసేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తూ ‘జపనీస్ టెక్నాలజీతో నిర్మించిన వాటర్ఫాల్’ అని బీజేపీ ప్రభుత్వంపై సెటైర్ వేసింది. ఇలాంటి ఘటనలతో నిర్మాణ లోపాలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
వెన్నచర్ల పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
TG: మారుమూల గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, ల్యాబొరేటరీని పరిశీలించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

విద్యార్థుల భద్రతకు భంగం కలిగిస్తే సహించం: AIPSU
TG: విద్యార్థుల భద్రత, విద్యా భవిష్యత్తుకు భంగం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నిర్వహిస్తే సహించేది లేదని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ‘విన్స్ పాఠశాల’ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించకుండా పాఠశాలను నిర్వహించడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్తుతో పాటు వారి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వక్ఫ్ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
AP: వక్ఫ్ భూముల వివరాలు, హద్దులను నిర్ధారించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ నూహ్, వీఆర్వో సైదా ఆధ్వర్యంలోని సర్వే బృందం పరిశీలించింది. భూముల విస్తీర్ణం, హద్దులు, ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు భూముల సరిహద్దులను గుర్తించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేశారు.

తుర్కపల్లి ప్రెస్క్లబ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
TG: నల్గొండ జిల్లా కనగల్ మండలం తుర్కపల్లిలో సీనియర్ జర్నలిస్టుల ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జర్నలిస్టుల సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడిగా సూర్యంరాజు, ఉపాధ్యక్షుడిగా నర్సింహులు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజ్కుమార్గౌడ్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా రాజ్కుమార్, సలహాదారుడిగా రాంనర్సింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్
TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమనగర్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలు, మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు సూచనల మేరకు ఈ కమిటీని ఎన్నుకున్నారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిని సునీల్, ఉపాధ్యక్షుడు కందిక రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కమిటీకి నూతన బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్, ఉపాధ్యక్షుడిగా తనువుల కొమ్మలను ఎంపిక చేశారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
TG: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2వ పీఆర్సీని ప్రకటించాలని కోరారు.

ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం
TG: విద్యార్థినుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు సేవాభావాన్ని పెంపొందించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఓ చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఓ చంద్రకళ మాట్లాడుతూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.

NICలో 376 జాబ్స్.. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్
NICలో (Scientific/Technical Assistant-A) 376 పోస్టులకు <a href="https://recruitment.nic.in/">నోటిఫికేషన్</a> రిలీజ్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, సెప్టెంబర్ 30 చివరి తేదీ. జనరల్/EWSకు 30 ఏళ్లు, OBC-NCLకు 33, SC/STలకు 35 ఏళ్ల వరకు అర్హత ఉంది. సంబంధిత టెక్నికల్ డిగ్రీతో పాటు 2024, 2025 లేదా 2026 GATE స్కోర్ ఉండాలి. UR/OBC/EWS మేల్ క్యాండిడేట్స్కు రూ.800 ఫీజు ఉంటుంది. SC/ST/PwBD/మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత సమాచారం కోసం ఇక్కడ <a href="https://recruitment.nic.in/">Click</a> చేయండి.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
TG: నేరాల నియంత్రణతో పాటు గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటు నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్థానికులు ముందుకు రావాలని సూచించారు.
వరంగల్ నుంచి తొర్రూర్కు బస్సు సౌకర్యం కల్పించాలి
TG: రాత్రి 8గంటలు దాటితే వరంగల్ నుంచి తొర్రూర్, వర్ధన్నపేట ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర పనుల కోసం వరంగల్కు వచ్చే ప్రజలు రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 9గంటల తర్వాత వరంగల్ నుంచి తొర్రూర్కు ఒక బస్సును నడపాలని కోరారు.
తప్పుల్లేని ఓటర్ జాబితానే ఎస్ఐఆర్ లక్ష్యం
TG: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తూ తప్పుల్లేని, స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో నోటీసులు జారీ చేసిన ఓటర్లతో నిర్వహించిన హియరింగ్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ఓటరు వివరాలను ఆయన స్వయంగా యాప్లో అప్లోడ్ చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత అడ్మిషన్లు.. తేదీలు ఇవే
TG: ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని ప్రిన్సిపాల్ కె. జయమ్మ గురువారం తెలిపారు. ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నల్ల బ్యాడ్జీలతో విధులకు.. కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన
AP: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ జేఏసీ ఆదేశాల మేరకు గురువారం పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని కోరారు.

మతాలకు అతీతమైన మానవత్వం..అదే ‘కేరళం’
కేరళం రాష్ట్రం మరోసారి మతాలకతీతంగా నిలబడి తన ఘనత చాటింది. చోట్టానిక్కరకు చెందిన ఆర్థడాక్స్ క్రైస్తవ ఫాదర్ ఓ.జె. జేకబ్ ఇంట్లో 26 ఏళ్లుగా ఉన్న పార్వతి(88) అనే మహిళకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో క్రైస్తవ ప్రార్థనలు కూడా చేశారు. 2000లో ఫాదర్ జేకబ్ భార్య మరణించిన తర్వాత ఆయన ఆరేళ్ల కుమార్తె మెరిన్ను చూసుకోవడానికి పార్వతి అక్కడికి వచ్చారు. అలా ఆ కుటుంబంలో మనిషిగా మారారు.
స్వీట్ Shopsపై రైడ్స్.. కస్టమర్స్కు పోలీసుల అలర్ట్!
TG: హైదరాబాద్ పోచారం IT కారిడార్లో స్వీట్ షాప్స్పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. చౌదరిగూడలోని ఓ స్వీట్ షాపులో ఉప్పల్ పోలీసులు, SOT టీమ్ రైడ్ చేశారు. స్వీట్ల తయారీలో ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో రాజస్థాన్కు చెందిన షాప్ ఓనర్ కమల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్స్ స్వీట్స్ కొనేముందు తయారీ, Expiry డేట్ చెక్ చేయాలని, స్మెల్, టేస్ట్తో పాటు స్వీట్ క్వాలిటీని కూడా ఒకసారి చెక్ చేయాలని సూచించారు.

మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు
AP: బార్, వైన్స్ షాపుల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై తాడేపల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బార్, వైన్స్ షాపుల యాజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ వీరేంద్ర పర్యవేక్షణలో ఎస్సై ఖాజావలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. షాపుల వద్ద గొడవలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

29న ‘భారత రాజ్యాంగం, రక్షణ’పై Special Talk
TG: ఎస్.జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 29 సాయంత్రం 6 గంటలకు ‘భారత రాజ్యాంగం, రక్షణ’ అనే అంశంపై Special Talk నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ MP డా.మేనకా గురుస్వామి మాట్లాడతారు. చీఫ్ గెస్టుగా నల్సార్(NALSAR) హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు వస్తారు. హైదరాబాద్ నగరం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) మెయిన్ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ధర్నా
AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్వాసితులతో కలిసి చేపట్టిన ఈ ఆందోళనలో ముంపు ప్రాంతంలోని అన్ని గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ముంపునకు గురవుతున్న వ్యవసాయ భూములకు మెరుగైన ప్యాకేజీ అందించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే సమయాన్నే కటాఫ్ తేదీగా ప్రకటించి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పరిహారం ఇవ్వాలన్నారు.

లారీ డ్రైవర్పై దాడి.. Vehicle Inspector డ్రైవర్పై కేసు
AP: విశాఖ షీలానగర్లో లారీ డ్రైవర్పై దాడి ఘటనలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెహికల్స్ చెక్ చేసే టైమ్లో లారీ ఆపకుండా వెళ్లడంతో దాన్ని వెంబడించి అడ్డుకున్న ఇన్స్పెక్టర్ డ్రైవర్.. <a href="https://www.theclearcutnews.com/n/LsCCiAo">క్యాబిన్లోకి వెళ్లి డ్రైవర్పై దాడి</a> చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఓనర్ల అసోసియేషన్ కంప్లైంట్తో కేసు బుక్ అవగా, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పార్వతిను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సీపీని ఆదేశించింది.

రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు
AP: రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు మంగళగిరిలో మోడల్ రైతుబజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నిడమర్రు రోడ్డులో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో నిర్మించనున్న రైతుబజారుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా విక్రయించుకునేలా రిటైల్, హోల్సేల్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.