Latest

UPని ముంచెత్తిన వరదలు.. 16 వేల మందికి పైగా తరలింపు!
UPలో వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 35 జిల్లాల్లో వరద ప్రభావం కనిపించగా, 23 జిల్లాల్లో పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు; బుధవారం 3,042 మందిని రక్షించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. సహాయక చర్యల కోసం 1,499 పడవలు, మోటార్ బోట్లు, 1,067 వైద్య బృందాలను రంగంలోకి దించారు. చిట్రకూట్లో మందాకిని నది ఉప్పొంగడంతో 36 గ్రామాల్లో సుమారు 14 వేల మంది ప్రభావితమయ్యారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పడవలతో ప్రజలను బయటకు తీసుకొస్తున్నారు.

వీఆర్ఓ ఆరోగ్యంపై తహసీల్దార్ ప్రత్యేక పర్యవేక్షణ
AP: కర్నూలు జిల్లా హొలగుంద మండలం లింగంపల్లిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ రామచంద్ర ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విషయం తెలుసుకున్న హొలగుంద తహసీల్దార్ లక్ష్మీరాజు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. చికిత్స పూర్తయ్యే వరకు రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని తహసీల్దార్ పర్యవేక్షిస్తూ వివరాలు తెలుసుకున్నారు. వీఆర్వో ప్రాణాలను కాపాడేందుకు కృషిచేసిన అధికారులకు అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.

ఆలయం కూల్చివేతపై పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్!
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో 100 ఏళ్లకు పైబడిన హిందూ ఆలయం ఆగస్టు 21న కూల్చివేతకు గురైంది. ఆలయ స్థలాన్ని పక్కనే ఉన్న మదరసా కోసం ఉపయోగించేందుకు కావాలనే కూల్చేశారని హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇండియా తీవ్రంగా స్పందిస్తూ దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది. మైనారిటీల భద్రతపైనా పాకిస్థాన్ను హెచ్చరించింది.

AI ఎంట్రీ-లెవల్ Jobs తీసేస్తే.. రేపటి Experts ఎక్కడి నుంచి?
కాలేజీ పూర్తయ్యాక మొదటి ఉద్యోగం దొరకడం, కెరీర్కు తొలి మెట్టు. కానీ AI కారణంగా ఈ మెట్టే తగ్గిపోతే భవిష్యత్లో నిపుణులు ఎక్కడి నుంచి వస్తారు? ఇదే ఇప్పుడు టాలెంట్ మార్కెట్లో కీలక ప్రశ్న. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల్లోని పునరావృత పనులను AI సులభంగా ఆటోమేట్ చేయగలదు. దీంతో సంస్థలకు వెంటనే ఖర్చు, సమయం తగ్గొచ్చు. కానీ జూనియర్లకు నేర్చుకునే అవకాశం తగ్గితే, రేపటి సీనియర్ నిపుణుల కొరత రావచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు కంపెనీలు AIతో పాటు శిక్షణ, అప్రెంటిస్షిప్ అవకాశాలపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

AI వల్ల Gen-Zలో క్రియేటివ్ థింకింగ్ తగ్గుతుందా?
ఒకప్పుడు ఏదైనా కొత్త ఐడియా రావాలంటే మనమే ఆలోచించేవాళ్లం, ఇప్పుడు రెండు మాటలు టైప్ చేస్తే AI వెంటనే సమాధానం, ఐడియాలు, డిజైన్ కూడా ఇచ్చేస్తుంది! ఇదే Gen-Zలో క్రియేటివ్ థింకింగ్ తగ్గిస్తుందా అనే ప్రశ్నకు కారణం. కొన్ని అధ్యయనాలు AIతో పని చేసినప్పుడు ఆలోచనల నాణ్యత పెరగొచ్చని చెబుతున్నాయి.. కానీ సొంతంగా ఆలోచించే ప్రయత్నం తగ్గితే ఆలోచించే సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉంది. సమస్య AIలో కాదు.. మనం దాన్ని ఆలోచనకు సహాయకంగా వాడుతున్నామా, లేక మన బదులు ఆలోచించనిస్తున్నామా అన్నదే విషయం. ముందు మన ఆలోచన.. తర్వాత AI.

కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి: తుమ్మల
తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కేంద్రం సహకారం కోరుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్రంలో ఆయిల్పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పామ్కు కనీస మద్దతు ధర రూ.25వేలు నిర్ణయించాలని, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్నను 100 శాతం సేకరించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

IIT, NIT తరహాలో మౌలిక వసతులు: లోకేశ్
AP: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలోని JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. IITలు, NITల తరహాలో ఆధునిక మౌలిక వసతులు, ప్రయోగశాలలు, నైపుణ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఫ్యూచర్ సిటీలో డిఫెన్స్ ఎక్స్పో: CM రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను CM రేవంత్రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో రాజ్నాథ్సింగ్ను కలిసిన CM.. డిసెంబరు 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో పాల్గొనాలని కోరారు. సమ్మిట్లో నిర్వహించే రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలతో పాటు త్రివిధ దళాల ఆధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్పోలో ప్రదర్శించనున్నట్లు వివరించారు.

ప్రతి గ్రామం.. ప్రతి పట్టణానికి జలభద్రత: ఉత్తమ్
తెలంగాణలో నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగానికి సమగ్ర ప్రణాళిక అవసరమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో జలభద్రతను బలోపేతం చేసేందుకు ప్రతిగ్రామం, పట్టణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన జల్ సంచయ్–జన్ భాగీదారీ సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 17.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మానేరు, కడెం జలాశయాల్లో పూడిక తొలగింపు ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వివరించారు.

ప్రతి ఎకరాకు సాగునీరు.. ఇదే లక్ష్యం: చంద్రబాబు
AP: గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని అన్ని నదులతో అనుసంధానించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని CM చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమకాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలను సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు తీసుకువెళ్తామని CM తెలిపారు.

Gen Zకి పెళ్లిపై ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతోంది?
“ముందు పెళ్లి.. తర్వాత మిగతావన్నీ” అనే ఆలోచన కంటే.. “ముందు కెరీర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన పీస్” అంటోంది Gen Z! 2025లో ఇండియన్ జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో వచ్చిన ఓ స్టడీ.. 100 మంది అవివాహిత మిలీనియల్స్, Gen Z అభిప్రాయాలను పరిశీలించింది. ఇందులో Gen Z సొసైటీ ప్రెజర్ కంటే ఎమోషనల్ రెడీనెస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అంటే పెళ్లిని పూర్తిగా వద్దనడం కంటే.. ముందు లైఫ్లో స్థిరపడాలి, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అనే ఆలోచన కనిపిస్తోంది.

ఇల్లు చిన్నదైందా.. లేక మనమే పెద్దవాళ్లమయ్యామా?
చిన్నప్పుడు ఆ ఇంటి గుమ్మం దాటితే ప్రపంచమే పెద్దగా అనిపించేది.. మెట్ల మీద పరుగులు, గదుల్లో ఆటలు, మూలల్లో దాచిన జ్ఞాపకాలు అన్నీ అంతులేనివిగా ఉండేవి. కానీ ఏళ్ల తర్వాత అదే ఇంటికి వెళ్తే గదులు చిన్నగా, మెట్లు తక్కువగా అనిపిస్తాయి. నిజానికి ఇల్లు మారలేదు.. మనం పెరిగాం. చిన్నప్పుడు మన ఎత్తు, చూపు, ప్రపంచం చిన్నవి కాబట్టి ఆ ప్రదేశం పెద్దగా అనిపించింది. ఇప్పుడు మన అనుభవాలు, అవసరాలు, ప్రపంచం విస్తరించడంతో అదే ఇల్లు చిన్నదిగా కనిపిస్తోంది. అందుకే కొన్ని ఇళ్లు గోడలతో కాదు.. మన జ్ఞాపకాలతో పెద్దవిగా ఉంటాయి.

జీవిస్తున్నామా.. లేక చూపిస్తున్నామా?
మంచి క్షణం ఎదురైతే.. దాన్ని ఆస్వాదించే ముందు ఫోన్ తీసి ఫోటో తీస్తున్నామా? తినే ఫుడ్, వెళ్లే ట్రిప్, కలిసే మనుషులు.. ప్రతి అనుభవం వెంటనే పోస్ట్ చేయాలనే అలవాటు పెరుగుతోంది. సోషల్ మీడియాలో పంచుకోవడం తప్పు కాదు, కానీ ప్రతి క్షణం ఇతరులకు చూపించాలనే ఆలోచన పెరిగితే మన అనుభవం కంటే వారి రియాక్షన్ ముఖ్యమవుతుంది. మనం ఏం ఫీల్ అవుతున్నామో కంటే.. అది ఎలా కనిపిస్తుందో ఆలోచిస్తాం. నిజమైన జీవితం కెమెరా ముందు కాదు.. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత సంతోషంగా అనిపించడంలో ఉంటుంది. చివరికి.. మనం జ్ఞాపకాలను జీవిస్తున్నామా?

సగం సమాచారం.. ఫుల్ కాన్ఫిడెన్స్!
మనకు విషయం పూర్తిగా తెలియకపోయినా.. ఎవరో ఒకరు అడిగితే వెంటనే “నా ఒపీనియన్ ఇదే” అని చెప్పేస్తాం. ఎందుకంటే మన మెదడు ఖాళీగా ఉండటం కంటే, అసంపూర్ణ సమాచారంతోనైనా ఒక నిర్ణయానికి రావడాన్నే సులభంగా భావిస్తుంది. పైగా సోషల్ మీడియాలో ఒకే వైపు కథనం పదేపదే కనిపిస్తే, అది నిజమే అనిపించొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కానీ తెలియని విషయంపై గట్టిగా మాట్లాడటం, తెలిసిన విషయాన్ని చెప్పడంతో సమానం కాదు. “నాకు పూర్తిగా తెలియదు” అని చెప్పగలగడం కూడా ఒక తెలివైన స్పందనే.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే చిన్న తప్పులు
పిల్లలను పెంచడం అంటే వాళ్లకు మంచి స్కూల్, మంచి చదువు, మంచి సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే కాదు.. రోజూ మనం మాట్లాడే మాటలు, చూపించే ప్రవర్తన కూడా వాళ్లపై బలమైన ముద్ర వేస్తాయి. “నీకు ఇది రాదు” అనడం, ఇతర పిల్లలతో పోల్చడం, వాళ్ల తప్పులను వెంటనే ఎత్తిచూపడం, ప్రతి సమస్యను మనమే పరిష్కరించడం లాంటి చిన్న విషయాలు పిల్లల్లో భయం, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీయొచ్చు. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు కంటే.. వాళ్లతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా గమనించాలి.

చెత్త వాహనాల పెట్రోల్ చోరీ.. ఇద్దరు డ్రైవర్లపై కేసు!
జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చెత్త వాహనాల నుంచే పెట్రోల్ చోరీ! విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరు డ్రైవర్లు పెట్రోల్ తీస్తుండగా పట్టుబడ్డారు. అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఇప్పటివరకు 83 లీటర్ల పెట్రోల్ తీశారని, దాదాపు రూ.10 వేల విలువ చేస్తుందని టౌన్ సీఐ పి.కరుణాకర్ చెప్పారు. కేసు నమోదు చేశారు. ఎస్సై జి.మహేష్ దర్యాప్తు చేస్తున్నారు.

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
ఖమ్మం జిల్లా వేంసూరులో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. SIR 2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై ఆయన దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల వివరాలు, బీఎల్ఓల పరిశీలన చేశారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

పదిరలో భర్త చేత భార్య హత్య.. అత్తపై కూడా దాడి!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో దారుణం జరిగింది. భర్త పల్లపు సురేష్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో అత్త కూడా తీవ్రంగా గాయపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వృద్ధురాలిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

గోబర్ గ్యాస్ ప్లాంట్.. సూరారంలో దుర్వాసన ముప్పు!
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో కొత్తగా ప్రారంభమైన గోబర్ గ్యాస్ ప్లాంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు దుర్వాసన భరించలేనంతగా వస్తోంది. 40 శాతం పనులు మాత్రమే పూర్తయిన ఈ ప్లాంట్ 100 శాతం పూర్తయితే ఇంకా ఎంత భయంకరమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. NH 563 మీద ప్రయాణించే వారు, చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పశువులు, పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. PCB అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలానికి చెందిన ఓ పేద విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఆమె పేరు జిల్లెళ్ళ భవ్యతేజిని. నార్సింగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు జంగయ్య, పరిమళ రాణి. ఈ చిన్నారి బాక్సింగ్ రింగ్లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ షేక్పేట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఇప్పటివరకు ఆమె 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. పేదరికాన్ని జయించి.. ఇలా మెరవడం అద్భుతం కదూ! ఆమె ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రీ-సర్వే పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షించారు. మొత్తం 83 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. మిగిలిన 36 గ్రామాల్లో పనులు 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, ఎంఆర్ఐ ఇందిర పాల్గొన్నారు.