Latest

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
ఢిల్లీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఒక గోల్డ్ తో సహా 5 మెడల్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్ పి.వి. సింధు, ఈసారి కూడా బరిలోకి దిగుతోంది. రీసెంట్గా జపాన్ టైటిల్ కూడా గెలవడంతో ఆమెపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఐర్లాండ్ ప్లేయర్ సోఫియాతో సింధు పోటీపడనుంది. ఆమెతో పాటే మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట కూడా పతకాలు సాధించాలని కోరుకుందాం.

భోగాపురంలో తొలి Flight.. ఏటికొప్పాక బొమ్మలతో స్వాగతం
AP: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 విమానం 6.45 గంటలకు భోగాపురంలో దిగింది. ప్రయాణికులకు అధికారులు ఎటికొప్పాక బొమ్మలు అందించి స్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు భోగాపురం నుంచి హైదరాబాద్కు తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్, బెంగళూరుకు ఇండిగో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ–భోగాపురం మధ్య 20 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు.

KGBVలో ఫుడ్ పాయిజన్.. 18 మంది ఆసుపత్రికి
TG: సిద్దిపేట జిల్లా మద్దూరు KGBVలో పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మొత్తం 18 మంది విద్యార్థినులకు వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయం వైద్య పరీక్షల అనంతరం తేలనుంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

Gen Z రోజుకు ఎన్ని గంటలు Phone చూస్తోంది?
Gen Z రోజుకు ఎంతసేపు ఫోన్ చూస్తుందో తెలుసా?📱ఒకే నంబర్ అందరికీ వర్తించదు.. దేశం, వయసు, చదువు, పని, యాప్స్ వాడకం బట్టి మారుతుంది. 2026లో భారతదేశంలోని 18–24 ఏళ్ల 400 మంది యువతపై జరిగిన ఓ స్టడీలో సగటు రోజువారీ స్మార్ట్ఫోన్ స్క్రీన్ టైమ్ 5.63 గంటలుగా నమోదైంది. మరో 2025 UK సర్వేలో 16–24 ఏళ్ల Gen Z రోజుకు సగటున 4.84 గంటలు ఫోన్ వాడుతున్నట్లు తేలింది. అయితే ఈ టైమ్ అంతా సోషల్ మీడియా కోసం మాత్రమే కాదు.. చదువు, మెసేజింగ్, వీడియోలు, పని, సెర్చ్ వంటి పనులు కూడా ఇందులో ఉంటాయి. మరి మీ Screen Time ఎంత? 🙂

గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం
AP: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకడంతో తీవ్ర విషాదం నింపింది. పంచాయతీరాజ్ శాఖలో AEగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకారు. గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి మనవడిని రక్షించారు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా నూకరాజు, మీనా, సౌజన్య గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు ముమ్మరం చేశాయి.

హైదరాబాద్కు మరో భారీ హాస్పిటల్.. నేటి నుంచి TIMS సేవలు
TG: సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (DRMCR TIMS) నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. CM రేవంత్రెడ్డి ఈరోజు సా. 4.30 గం. హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రంగంలో ఒకే ఫేజ్లో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఇది గుర్తింపు పొందింది. రూ.1,126 కోట్లతో 22.6 ఎకరాల్లో, 11.70 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ హాస్పిటల్ను నిర్మించారు.

వీకెండ్ 2 గంటల్లా.. మండే 2 రోజుల్లా ఎందుకు?
శనివారం మార్నింగ్ వచ్చినట్టు ఉంటుంది.. చూస్తుండగానే సండే నైట్! కానీ మండే మాత్రం గడియారం కూడా స్లోగా తిరుగుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది?😭⏰ దీనికి మన మెదడులోని టైమ్ పర్సెప్షన్ ఒక కారణం. వీకెండ్లో ఫ్రెండ్స్, మూవీస్, ఔటింగ్స్, రీల్స్ లాంటి నచ్చిన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు టైమ్ను ఎక్కువగా పట్టించుకోం. అదే మండే రోజు పని లేదా క్లాసెస్ బోరింగ్గా, స్ట్రెస్గా అనిపిస్తే గడియారాన్ని ఎక్కువగా గమనిస్తాం. దీంతో టైమ్ నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపించొచ్చు. గడియారం సేమే బ్రో.. మండేనే మనకు పర్సనల్ ఎనిమీ!😭

రెండు లక్షల ఉద్యోగాలు ఏవి ? : సునీతా లక్ష్మారెడ్డి
TG: రేషన్ కార్డులపై CM రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు ఎందుకు పెడుతున్నారని BRS MLA సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీని KCR ప్రభుత్వం ప్రారంభించిందని, దానికి కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయాన్ని పండుగ చేశామని CM చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం హామీలపై ప్రశ్నలు సంధించారు.

NTA నిర్లక్ష్యానికి అభ్యర్థులే బలి.. మూడు NET పేపర్లు రద్దు!
UGC NET జూన్ 2026 పరీక్షల్లో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పేపర్లను NTA రద్దు చేసింది. ఈ మూడు పరీక్షల్లో తప్పులు, లోపాలున్నాయని అభ్యర్థుల నుంచి కంప్లైంట్స్ రావడంతో స్పెషల్ కమిటీ పరిశీలించింది. ఇందులో లోపాలు ఉన్నట్లు స్పెషల్ కమిటీ గుర్తించింది. తరువాత రీ-టెస్ట్ నిర్వహించాలని NTA నిర్ణయించింది. ఇంగ్లిష్, కామర్స్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 9న, సోషియాలజీ ఎగ్జామ్ సెప్టెంబర్ 10న జరగనున్నాయి. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు PhD అడ్మిషన్స్కు UGC NET కీలకం.

ఈశా గ్రామోత్సవం-2026.. విజేతలు వీరే
TG: గ్రామీణ క్రీడాకారులను ఒక్కతాటిపైకి తీసుకురావడమే ఈశా గ్రామోత్సవం-2026 లక్ష్యమని ఈశా యోగా కేంద్రం సమన్వయకర్త స్వామి అంబర తెలిపారు. హైదరాబాద్ LB స్టేడియంలో జరిగిన మహిళల త్రోబాల్, పురుషుల వాలీబాల్ రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మహిళల త్రోబాల్లో కోయచల్క వారియర్స్, పురుషుల వాలీబాల్లో రంగారెడ్డి జిల్లా దేవుని పడకల్ జట్లు రాష్ట్ర ఛాంపియన్లుగా నిలిచాయి.

ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలి: నేహా బోరా
TG: ప్రజాస్వామ్యాన్ని, హక్కులను పరిరక్షించుకోవాలంటే యువత భయపడకుండా ప్రశ్నించే ధైర్యాన్ని పెంచుకోవాలని AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, JNUSU మాజీ అధ్యక్షుడు సాయి బాలాజీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని లామకాన్లో జరిగిన 15వ హాసన్ మెమోరియల్ లెక్చర్-2026లో వారు మాట్లాడారు. ద్వేష రాజకీయాలకు ముగింపు పలికే విధంగా యువత నిలవాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో యువత, విద్యార్థుల పాత్రను గుర్తుచేస్తూ ఖుదీరామ్ బోస్, భగత్సింగ్, అష్ఫాఖుల్లా ఖాన్ త్యాగాలను ప్రస్తావించారు.

ఉద్యోగుల సమస్యలపై ఇక పోరుబాటే: బొప్పరాజు
AP: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై AP JAC ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు రావాల్సిన సుమారు రూ.40వేల కోట్ల బకాయిలను అడుగుతుంటే ఉద్యోగులనే ప్రజల ముందు దోషులుగా చూపించడం సరికాదని JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం విషయంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకం: రవిశంకర్
AP: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి శక్తివంతమైన కేంద్రబిందువుగా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఆయన నిర్మాణ శైలి, కళాకృతులను ప్రశంసించారు. అనంతరం గూడెపువలసలో GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. GMR గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 11 వృత్తివిద్యా కోర్సుల్లో 239 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

తులం బంగారం హామీ ఏమైంది? : KTR
TG: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని KTR ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న భరోసాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదని, పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో BRS ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బాధితులకు భరోసా ఏది? : మేడా శ్రీనివాస్
AP: సైబర్ మోసాల్లో పోయిన డబ్బు ఎంత రికవరీ చేశారో ప్రజలకు లెక్క చెప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వేల కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నా.. వాటిని అరికట్టేందుకు ఖర్చు చేస్తున్న ప్రజాధనానికి తగ్గ ఫలితం కనిపించడం లేదని విమర్శించారు. పోలీస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాల వరకు ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఉండాలని కోరారు.

సెప్టెంబర్లో అన్ని లెక్కలు చెప్తా: CM
TG : వెయ్యిమంది KCRలు ఏకమై వచ్చినా నన్నేం చేయలేరని CM రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కుటుంబం, BRS రాజకీయ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. KCR పాలన ఫ్యామిలీ జస్టిస్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తోందన్నారు. యువత, నిరుద్యోగులు రాజకీయ ప్రచారాలకు ప్రభావితం కావొద్దని సూచించారు. గత ప్రభుత్వ పాలన, తమ ప్రభుత్వ పనితీరుపై రాబోయే సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని లెక్కలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు.

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!
సముద్రంలో ఎటు వెళ్లాలో మ్యాప్ లేకుండానే తాబేళ్లు ఎలా తెలుసుకుంటాయో తెలుసా? వాటికి భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ మాగ్నెటిక్ సంకేతాలను ఉపయోగించి సముద్రంలో దిశను గుర్తించడంతో పాటు, దూరంగా ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణించగలవు. కొన్ని రీసెర్చ్ల ప్రకారం, తాబేళ్లు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు వాసన వంటి ఇతర సంకేతాలను కూడా ఉపయోగించవచ్చు. అంటే GPS లేకపోయినా.. ప్రకృతే వాటికి నావిగేషన్ సిస్టమ్లా పనిచేస్తుందన్నమాట అనుకోండి!

MNR ఫౌండేషన్ 9వ ఉచిత కంటి వైద్య శిబిరం
AP: మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో MNR ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో 9వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుల్లూరు :ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(PACS)లో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 112 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 57 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.

యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు
TG: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 'యాక్సిస్ బ్యాంక్' ఆధ్వర్యంలో సంగీతం, నాట్యం, పాటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకకు మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు, ఉద్యోగులు, పిల్లల తల్లిదండ్రులు, డాన్స్ టీచర్లు పాల్గొన్నారు.

‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’
AP: ఎన్టీఆర్ జిల్లా పెడన మండలంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Dr.రాళ్ళపల్లి లక్ష్మణ స్వామి(చిన్నాపురం డాక్టర్) సహకారంతో పెడన బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలలో ‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’ కార్యక్రమం చేపట్టారు. 12000 మందికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1.6 లక్షల మొక్కలు పంచినట్టు సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఉస్మాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, పేరిశెట్టి నాగరవి, ఇమ్మనేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు
AP: మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త అధ్యక్షుడిగా గురిజాల సుధీర్, కార్యదర్శిగా వంక అనంత కుమార్, ట్రెజరర్గా బైత సత్యనారాయణని, గౌరవ అధ్యక్షులుగా చిలంకుర్తి నాగభూషణం(శేషు)ని మరో 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని ఆగస్టు 19న నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని చెప్పారు.