Latest
రైల్వే టీసీ అవతారంలో యువతిపై వేధింపులు
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ నుండి ఛప్రా వెళ్తున్న ఒంటరి యువతిని రైల్వే టీసీ పేరుతో ఒక వ్యక్తి వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాష్రూమ్ వైపు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు పోలీసులకు చెప్పగా, పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. నిందితుడిపై నిర్లక్ష్యం వహించిన రైల్వే పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.

తండ్రి బాటలోనే సోనమ్ వాంగ్చుక్
లడాఖ్కు ఎస్టీ హోదా సాధించడం కోసం 1984లో సోనమ్ వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ఐదు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఉద్యమం పెద్దది కావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా లేహ్కు వచ్చి ఆయనకు జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎస్టీ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తండ్రి బాటలోనే ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ కూడా ప్రస్తుతం అదే రీతిలో సీజేపీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే పార్లమెంట్ దేనికోసం?
సీజేపీ నిరసనపై కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ స్పందించారు. అహింసాత్మక నిరసన జరుగుతుండగా లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లాఠీ చార్జ్ హింసాత్మక చర్య అని, దీని వెనుక కారణమేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తమ ఆందోళనలను వ్యక్తం చేసే స్థలం కావాలని, కనీసం పార్లమెంట్ అందుకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఈ సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే మరి దేనికోసం అని ప్రశ్నించారు.

జేపీ నడ్డాను కలిసిన CJP ప్రతినిధులు
దిల్లీలో నిరసన తరువాత కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులతో ప్రభుత్వం సమావేశమైంది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ 'X' వేదికగా స్పందిస్తూ తను, అశుతోష్ రాన్కాతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశామని తెలిపారు. తాము తమ డిమాండ్లతో కూడిన లేఖను సమర్పించగా, ఈలోగా ఆయన అంతర్గతంగా దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారని అన్నారు.
సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణం: ప్రియాంకా గాంధీ
సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణమని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. వారు మన పిల్లలని..వారే దేశ భవిష్యత్తు అని తెలిపారు. ఈ పార్లమెంట్ వారిదని..ఇది ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యం కాదని పేర్కొన్నారు. రాహుల్ ఈ సమస్యను చాలా కాలంగా లేవనెత్తుతున్నారని తెలిపారు. మాట్లాడకుండా పిల్లలపై లాఠీచార్జ్ చేయడం ఏమిటని మండిపడ్డారు.

ఇది బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి: రేవంత్ రెడ్డి
TG: విద్యార్థులు NEET పేపర్ లీక్ కుంభకోణంపై న్యాయం కోరుతూ పార్లమెంట్ వరకు మార్చ్ చేస్తుండగా, వారిని లాఠీలతో కొడుతూ, టియర్ గ్యాస్ ఉపయోగించి దాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ యువతను పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని చూస్తోందన్నారు. విద్యార్థులపై పడే ప్రతి దెబ్బ బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక భయాన్ని బయటపెడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిరాహార దీక్షను విరమించిన నేహా బోరా
23 రోజులుగా విద్యార్థి నాయకులు నేహా బోరా, మనీష్ కుమార్, అమీన్ అమితోజ్లు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు మనోజ్ ఝా, రాజారామ్ సింగ్, అమ్రా రామ్లతోపాటు న్యాయవాదులు, ప్రొఫెసర్లు దీక్షను విరమించాలని వారిని కోరారు. ఎలా పోరాడాలో ప్రతిపక్షాలన్నింటికీ మార్గం చూపించారని రాజారామ్ సింగ్ వారితో అన్నారు. వారి విజ్ఞప్తితో నిరాహార దీక్షను విరమించారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆఫీస్ బాత్రూంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఆయనను హాస్పిటల్కు తరలించారు. డాక్టర్స్ ఆయనను పరిశీలించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అనురాగ్ ధన్ఖడ్ 1994 బ్యాచ్కు చెందిన త్రిపుర క్యాడెర్ ఐపీఎస్ అధికారి.
పార్లమెంట్ ఎదుట నిరసన..ఎంపీ రేణుకా చౌదరి మద్దతు
దిల్లీ పార్లమెంట్ ముందు వివిధ డిమాండ్లతో నిరసన తెలుపుతున్న యువతకు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపారు. నిరసన చేస్తున్న యువతను అడ్డుకునేందుకు పార్లమెంట్ గేట్లు మూయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ దేశ యువతదని, గేట్లు ఎలా బంద్ చేస్తారని భద్రతా సిబ్బందిని, ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. యువత హక్కుల కోసం పోరాడుతుంటే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు.

సర్వం..లీకులమయం
2014 నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం, రాజస్థాన్లో రీట్ పరీక్ష, బీహార్లో BPSC పరీక్షలు, తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలు జరిగాయి. 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో కూడా ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తరువాత పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎక్సమినేషన్స్ చట్టం, 2024ను అమల్లోకి తీసుకొచ్చింది.
కేపీహెచ్బీ వద్ద రోడ్డు ప్రమాదం
TG: హైదరాబాద్ నగరం KPHB పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్ వద్ద రోడ్డు దాటుతున్న నర్సింహ(60)ను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. మృతుడు జహీరాబాద్ శిశుమందిర్ పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా గుర్తించారు.
పీఎం నరేంద్ర మోదీపై ధ్రువ్ రాఠీ కామెంట్
దిల్లీ జంతర్మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ను ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఓ యువకుణ్ని పోలీసులు కొడుతుండగా ‘ఇంకా కొట్టండి’ అంటూ అతను అరుస్తున్న వీడియోను షేర్ చేసి, ‘ఎవరినైనా భయం తీరిపోయేంత స్థాయిలో భయపెట్టకూడదనే పాఠం నరేంద్ర మోదీ నేర్చుకున్నారని’ అని పోస్ట్ చేశారు.
కావాలంటే మీరూ ఎలక్షన్స్లో నిల్చోండి: కంగనా రనౌత్
కావాలంటే మీరూ ఎలక్షన్స్లో నిల్చొని గెలవండి. అంతేకానీ, ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పొద్దు అంటూ ఎంపీ, నటి కంగనా రనౌత్ అన్నారు. దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాము తప్పకుండా సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేయాలని అనుకుంటున్నాయని, దాన్ని తిప్పికొడతామని చెప్పారు.

బైక్పై వెంబడించి డ్రైవర్, కండక్టర్పై దాడి
AP: బస్సు ఆపలేదని యువకుడు RTC సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు కోసం బస్టాప్లో ఎదురుచూస్తుండగా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు బైక్తో వెంబడించాడు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ సురేశ్, కండక్టర్ లీలా ప్రసాద్పై దాడి చేశాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతోనే ఆపలేదని తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా యువకుడు వినలేదు. ఘటనతో కరకట్ట రూట్లో గంటసేపు ట్రాఫిక్ జామ్అయింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాక్రోచ్ నిరసనకు మద్దతుగా మిస్డ్ కాల్
ఎడ్యుకేషన్ సిస్టంలో పేపర్ లీకేజీలు, ఇతర సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్చుక్ ఆధ్వర్యంలో 'చలో సంసద్' మార్చ్ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు తెలిపేందుకు 70116 70115 అనే ఫోన్ నెంబర్ కేటాయించారు. ప్రతి ఒక్కరూ ఈ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి అటెండెన్స్ నమోదు చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు పలకాలన్నారు.

చిన్నారుల ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని పూజలు
AP: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరవు తొలగిపోవాలని కోరుతూ భీమా లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు చిన్నారుల చేత తలపై నీటి బిందెలను మోయించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ పవిత్ర జలాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. ఆలయం కోట గుడిలో చిన్నపిల్లలతో పూజలు చేయడం గ్రామ ఆచారం. చిన్నారుల అమాయక ప్రార్థనలను దేవుడు త్వరగా ఆలకిస్తాడనే విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు.

గొడ్డళ్లు, తుపాకీతో స్మగ్లర్స్.. అటవీశాఖ హైఅలర్ట్
AP: మార్కాపురం జిల్లా కనిగిరి రేంజ్ పరిధిలోని శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ అలజడి రేపింది. వెలిగండ్ల మండలంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గొడ్డళ్లతో పాటు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారు దాడులు చేసేందుకు ఆయుధాలు సమకూర్చుకోవడంతో అధికారులు షాక్ అయ్యారు. CSపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉండటంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.

జాబ్ రావడంతో మారిన భర్త.. భార్యకు చిత్రహింసలు
TG: ఖమ్మం జిల్లా శంభునిగూడెంకు చెందిన సుమ(25)కు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం కొద్దిరోజులపాటు హైదరాబాద్లో ఉన్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, వరకట్నం తీసుకురావాలని వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఆమె గడ్డిమందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్వర్లు, ఆడబిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశారు.

బ్యారికేడ్లు ఎక్కి నిరసనలు కొనసాగించిన AAP నేతలు
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన 'ఛలో సంసద్' ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్దతిచ్చారు. AAP నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అతిషి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎక్కి ఆందోళనకారులను కలిశారు. నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరసనలు చేస్తున్నారని అన్నారు.

సీజేపీ నిరసనకారులకు మద్దతుగా వాలంటీర్స్
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యావ్యవస్థలో పేపర్ లీకేజీలపై జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు సీజేపీ వాలంటీర్స్ నిరసనకారులకు విసనకర్రలతో గాలి ఊపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మద్దతుదారులకు వైద్య సేవలు, తాగునీరు అందిస్తూ వాలంటీర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
TG: భార్య వేధింపులు తట్టుకోలేక పెళ్లయిన మూడు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తున్నాడు. మేలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మగతనం లేదని అతని భార్య వేధిస్తోంది. ఇటీవల అత్తగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్ను అవమానించింది. తీవ్ర మనస్తాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.