Latest

ఆ ఊళ్లల్లో రాఖీ పండగ జరుపుకోరు
దేశం అంతటా రక్షాబంధన్ వైభవంగా జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా ఈ పండుగను జరుపుకోవడం లేదు. UPలోని సథా, ధౌలానా ప్రజలు మహారాణా ప్రతాప్ వంశస్తులు. రాఖీ పండుగ రోజునే జరిగిన ఒక యుద్ధంలో వారి పూర్వీకులు ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారు. రాజస్థాన్లోని పాలిలో రాఖీ పండుగ రోజునే పాలివాల్ బ్రాహ్మణులపై మహమ్మద్ ఘోరీ దాడి చేసి దారుణంగా చంపేశాడు. అందుకే ఈ రోజును వారు పండుగగా కాకుండా విషాద దినంగా భావిస్తారు.
బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్
AP: విజయనగరం జిల్లా రాజాంలో రౌడీషీటర్తోపాటు మరోఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి డబ్బులు, బైక్ లాక్కున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజాం మెంతిపేటకు చెందిన రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు అలియాస్ దేవా, పెనుబాకకు చెందిన దిలీప్, ప్రసాద్లు ఫైర్స్టేషన్ మామిడితోట వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించారు. తమ వద్ద ఉన్న డబ్బులు, బైక్ ఇవ్వకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు భయపడి వాటిని అప్పగించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

నేపాల్కు మరో భారీ వరద ముప్పు
చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతం అయిన సిచువాన్ ప్రావిన్స్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో నేపాల్లో వరద బీభత్సం తగ్గకముందే మరో పెను విలయం విరుచుకుపడనుంది. మూడు రోజుల క్రితం వచ్చిన వరద కంటే దాదాపు ఐదు రెట్ల ఎక్కువ తీవ్రతతో మరో డెడ్లీ వరద ముంచుకొస్తోందని స్థానిక అధికారులు, పోలీసులు అత్యవసర ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా దూసుకొస్తున్న ఈ వరద మరో 20 నిమిషాల్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తనుందని సమాచారం అందింది. ప్రభావిత ప్రాంతాల్లో Red alert ప్రకటించారు.

పల్లెల్లో ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం
TG: జగిత్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాల్సిన కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు దాటి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రథమ చికిత్సకు మించి బెడ్లు ఏర్పాటు చేయడం, సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, అధిక మోతాదులో మందులు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్య అర్హతలు, అత్యవసర వైద్య సదుపాయాలు లేకుండా చికిత్సలు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి
TG: నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి ఇందిర చేత రాఖీ కట్టించుకుని అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయనకు సోదరి ఇందిర రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్ర పండుగను ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్పై దాడి
AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులో స్వల్ప రోడ్డు ప్రమాదం వివాదంగా మారి ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రోడ్డు ప్రమాదం విషయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఉపాధ్యాయుడిని కారులో నుంచి బయటకు లాగి యువకులు దాడి చేశారు. చిన్నపాటి వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన సమయంలో ఆవేశానికి లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి దారితీసిన పరిస్థితులు, బాధ్యుల వివరాలను పరిశీలిస్తున్నారు.

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి
TG: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో పాటు రాత్రివేళ పడుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. దోమలు, ఈగల బెడదతో పాటు అపరిశుభ్రత కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షల కోసం వెళ్లిన సమయంలోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఎమ్మార్పీఎస్కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప
TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బి. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షుడిగా పోషమొల్ల శామప్ప మాదిగ, ఉపాధ్యక్షుడిగా పరశురాంను నియమించారు. ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా పోతురాజు భీమ్సప్ప, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా కొత్త మళ్లేశ్ను ఎన్నుకున్నారు.

గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సర్వేలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. గతంలో 2,75,012 మంది ఓటర్లు ఉండగా, సర్వే అనంతరం ప్రస్తుతం 2,41,254 మంది ఉన్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 304 నుంచి 328కి పెరిగిందన్నారు. ఇప్పటివరకు 44,511 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారు 7,081 మంది ఉన్నారని చెప్పారు.

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి
AP: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వశిష్ఠ వంతెన వద్ద తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ కుమార్తెతో కలిసి స్కూటీపై వచ్చారు. అనంతరం చిన్నారిని వాహనంపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఏడుస్తున్న పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, గోదావరిలో దంపతుల కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక
AP: ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ప్రతి అర్జీపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేటలోని ఎస్.వి.ఎస్. కళ్యాణ మండపంలో ఇవాళ ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు.

విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం
AP: తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలను రూపొందించి ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. సీపీఎం తిరుపతి జిల్లా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలు, దళిత–గిరిజన సమస్యలు, విద్యా రంగ పరిస్థితులు, విమానాశ్రయ ప్రైవేటీకరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
TG: రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, సోదరభావాన్ని చాటుతూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సర్పంచ్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రాఖీలు కట్టి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

అమలాపురంలో ప్రతిష్టాత్మక న్యాయ సదస్సు
AP: ఆస్తి చట్టాలు, సవరించిన నిశ్చయాత్మక ఉపశమన చట్టంపై విస్తృత చర్చకు అమలాపురంలో ఈ నెల 30న జిల్లా న్యాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎండీ. అజామ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీ సి. పద్మనాభ రెడ్డి సెమినార్ హాల్లో సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.శివశంకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై కానున్నారు.

రూ.3 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు
AP: నెల్లూరులో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ తెలుగు గంగ ఇరిగేషన్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఈఈ మహేష్, డీఈఈ గౌతమ్, ఏఈఈ నారాయణరాజులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు వారి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీధి నాటకాలతో హెచ్ఐవీపై బిగ్ అవేర్నెస్
AP: వీధి నాటకాల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గొర్రెల శ్రీనివాస్ కళాజాత బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఆలమూరు, కొత్తూరు సెంటర్, మడికి ప్రధాన కూరగాయల మార్కెట్ సర్కిల్లో వీధి నాటకాల ద్వారా హెచ్ఐవీ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలను వివరించారు.

మైనారిటీ పాఠశాలలో వైద్య శిబిరం
TG: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలోని మైనారిటీ పాఠశాలలో ఆర్బీఎస్కే బృందం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ప్రథమ చికిత్స పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీపాల మాట్లాడుతూ వైద్య శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

పిల్లల చేతికి వాహనం.. ప్రాణాలకు ప్రమాదం
AP: పిల్లల సరదా కోసం మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు అప్పగిస్తే వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడినట్లవుతుందని కాకినాడ జిల్లా రౌతులపూడిలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రులు నిబంధనలను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. తాజాగా రౌతులపూడిలో మైనర్ బాలబాలికలు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దృశ్యం చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ పొందే వయస్సు రాకముందే వాహనం నడపడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అంబేడ్కర్పై అసత్య ప్రచారం.. అధికారులకు ఫిర్యాదు
AP: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు అధికారులను కోరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాను రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వృద్ధుడిపై రాయితో దాడి.. నిందితుడి అరెస్ట్
TG: వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కోసం డబ్బుల వసూళ్ల విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెరుకుపల్లి రెవెన్యూ శివారులో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బైరంపల్లి రాములు (58)పై కార్తిక్ అలియాస్ వంశీ (22) రాయితో దాడి చేశాడు. రాములు నోటిలోని నాలుగు పళ్లు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. కొందుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్తిక్ను షాద్నగర్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్హెచ్ఓ వరప్రసాద్ తెలిపారు.

సర్కార్కు ఉద్యోగుల అల్టిమేటం.. ఇక పోరుబాటే
TG: తమ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహించి నగరాన్ని నిర్బంధిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో నిర్వహించిన ఉద్యోగుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్ల సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేపడతామని ప్రకటించారు.